బేల, మార్చి 1 : గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో కిషన్ సూచించారు. మండలంలోని తోయిగూడ గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌళిక వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు పని కల్పించే విధంగా ప్రదేశంలో రెండు సార్లు ఫొటోలు తీసినప్పుడే వారికి డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధార్కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని సూచించారు. ఎండలు పెరిగిపోవడంతో రైతులు ఉదయం సమయంలోనే పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో తాగునీరు తప్పకుండా తీసుకెళ్లాలని తెలిపారు. అలాగే గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట టెక్నికల్ ఆసిస్టెంట్లు, ఫీల్డ్ ఆసిస్టెంట్లు ఉన్నారు.
మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలి
నార్నూర్, మార్చి 1 : నర్సరీల్లో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో కిషన్ అధికారులకు సూచించారు. గాదిగూడ మండలం పర్సువాడ(కే), సావిరి, దాబా(కే) గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను బుధవారం ఆయన పరిశీలించారు. రికార్డులు పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతి నర్సరీలో మొక్కలు పెంచాలని సూచించారు. హరితహారానికి మొక్కలు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం గాదిగూడలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలన్నారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట ఏపీడీ రాథోడ్ రవీందర్, ఎంపీడీవో సాయిప్రసాద్, ఏపీవో పవార్ నితిన్, సిబ్బంది ఉన్నారు.