ఆదిలాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కుష్నపల్లి సతీశ్ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకుని ఉద్యమానికి ఊపిరి పోశాడు. సీమాంధ్ర పాలకుల కుట్రలతో తెలంగాణ వస్తుందో లేదో అనే బెంగతో ఫిబ్రవరి 8, 2010న ఉరేసుకొని ఆత్మబలిదానం చేసుకున్నాడు. తెలంగాణవాదులు ఆందోళనలు, ధూంధాం కార్యక్రమాలు చూస్తూ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. తెలంగాణకు సీమాంధ్ర పాలకులు చేస్తున్న అన్యాయాన్ని గ్రామంలో పలువురికి చెప్పేవాడు. గ్రామంతోపాటు ఇతర ప్రాంతాల్లో జరిగే తెలంగాణ ఉద్యమ ఆందోళనలో స్నేహితులతో కలిపి పాల్గొనేవాడు. తల్లిదండ్రులతో తెలంగాణ వస్తే ఇక్కడి ప్రజలు మంచిగా జీవిస్తారని, అన్ని విధాలుగా లాభం జరుగుతుందని చెప్పేవాడు.
కుష్నపల్లి గంగారం-రూప దంపతులకు సతీశ్, ప్రమోద్ ఇద్దరు కుమారులు. దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. సతీశ్ స్థానికంగానే పదో తరగతి వరకు చదువుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన సతీశ్ తెలంగాణ ఉద్యమంలో ముందుండేవాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సీమాంధ్రపాలకులు కుట్రల వల్ల ప్రత్యేక రాష్ట్రం వస్తుందో.. రాదో.. అనే ఆందోళన చెందేవాడు. తన ఆత్మబలిదానంతో తెలంగాణ సిద్ధించి తనలాంటి యువకుల బతుకులు బాగు పడతాయనే ఉద్దేశంతో ఇంటి ఆవరణలోని కొట్టంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన సతీశ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. సతీశ్ తమ్ముడు ప్రమోద్కు రెవెన్యూ శాఖలో అటెండర్గా ఉద్యోగం ఇచ్చింది. తల్లిదండ్రులు గంగారం, రూప దంపతులకు రూ.10 లక్షల సాయం సర్కారు అందజేసింది. తమకు ప్రభుత్వం ఆందంచిన ఆర్థిక సాయం ఉపయోగపడిందని తండ్రి గంగారం తెలిపారు. తమ చిన్న కుమారుడు ప్రమోద్కు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంతో కుటుంబపోషణ బాగా జరుగుతున్నదని వారు అన్నారు.