బాసర, అక్టోబరు 18 : దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారు కూష్మాండ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, చతుర్వేద పారాయణం, లలిత సహస్రనామాలు, నివేదన హారతి, తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు అల్లం వడలు నైవేద్యంగా సమర్పించారు. సరస్వతీ అమ్మవారిని భక్తులు దర్శించుకొని ఆలయంలో ఉచితంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
అమ్మవారి నవరాత్రులకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో డాక్టర్ తిరుమల వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 100 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.
భైంసా, అక్టోబర్ 18 : భైంసాలోని గాంధీ గంజ్లో లోకేశ్వరం మండలం వాటోలి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు బుధవారం సోయాను అమ్మడానికి తీసుకొచ్చాడు. అయితే సోయాగాలి పట్టిన అనంతరం వెస్టేజ్ సోయాను హమాలీ తనకు కావాలని రైతును కోరగా ఇవ్వనని సంచిలో నింపుకుంటానని సంచి తీసుకుంటున్నాడు. అక్కడే ఉన్న హమాలీ రేకుడబ్బా పీపాతో రైతు శ్రీనివాస్ను కొట్టడంతో గాయలయ్యాయి. వెంటనే రైతులు గుమిగూడి నిరసన చేపట్టారు. అనంతరం పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు అక్కడికి చేరుకొని రైతును సముదాయించి చికిత్స నిమిత్తం దవాఖానకు తీసుకెళ్లారు. హమాలీని పోలీస్స్టేషన్కు తరలించారు.
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 18 : ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులకు డిపో మేనేజర్ కే కల్పన తన సొంత ఖర్చులతో దసరా కానుకలు అందజేశారు. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సోలేమాన్ పాల్గొని కార్మికులకు దసరా కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ను అభినందించారు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంతో పాటు డిపోను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని డిపో మేనేజర్ పేర్కొన్నారు.