కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ) ః ఆసిఫాబాద్ మండలం కుమ్రం భీం అడ ప్రాజెక్టు 2006లో రూ.270 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్-టీ నియోజవర్గాల్లోని 45,500 ఎకరాలకు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణంలో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే మూడింతలు పెరిగింది. ఇప్పటివరకు సుమారు రూ.498 కోట్లు ఖర్చుచేయగా, ప్రస్తుతం ప్రధాన కాలువల నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం తాజాగా మరో రూ.23.22 కోట్లను ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. భూసేకరణ పనులను ఇప్పటికే వేగవంతం చేసిన అధికారులు వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
18 ఏండ్లుగా పూర్తికాని వట్టివాగుకు జీవం
ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లోని 24 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 1977లో నిర్మించిన వట్టివాగు ప్రాజెక్టుకు ప్రత్యేక తెలంగాణలో ప్రభుత్వం నిధులను కేటాయించడంతో జీవం పోసుకుంటోంది. రూ.120 కోట్ల అంచనాతో 1977 ప్రారంభమైన వట్టివాగు ప్రాజెక్టు నిర్మాణం 1998లో పూర్తయ్యింది. కానీ.. నాణ్యతాలోపం కారణంగా ప్రధాన కాలువతోపాటు, చిన్న కాలవలకు గండ్లు పడడంతో రైతులకు నీరందించలేక పోయింది. రూ.9 కోట్లతో మళ్లీ మరమ్మతులు చేపట్టినా కనీసం స్థాయిలో కూడా సాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. నీరున్నప్పటికీ కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా మారింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రైతులకు ఉపయోగపడేలా మార్చేందుకు రూ. 3 కోట్లు కేటాయించి మళ్లీ జీవం పోస్తోంది.
జగన్నాథ్పూర్ ప్రాజెక్టుకు రూ. 12 కోట్లు
కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగుపై 2005లో 15 వేల ఎకరాలకు నీరందించేందుకు రూ.125 కోట్లతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు నేటికీ అసంపూర్తిగానే ఉంది. క్రస్ట్ గేట్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. కుడి.. ఎడ ప్రధాన కాల్వతోపాటు చిన్న కాల్వల పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ప్రాజెక్టు కాల్వల నిర్మాణ పనులు భూసేకరణ కారణంగా నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసేందుకు రూ. 12 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
వార్ధా బరాజ్కు రూ. 101.75 కోట్లు
ప్రభుత్వం వార్ధా బరజ్కు పెద్దపీట వేసింది. జిల్లాలో సుమారు లక్షా 56 వేల ఎకరాలు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం వార్ధా బారాజ్ను నిర్మిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో అధికారులు ఇటీవలే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన పూర్తి నివేదికలు తయారుచేశారు. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ. 101.75 కోట్లు కేటాయించింది. వార్ధా నదిపై బరాజ్ నిర్మాణంతో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని 11 మండలాల్లో దాదాపు 2 లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, సిర్పూర్-టీ, దహెగాం మండలాలతోపాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, తాండూర్ మండలాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందనున్నది.