చింతలమానేపల్లి, మే 6 : పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. చింతలమానేపల్లి మండలంలోని రవీంద్రనగర్-1లోని బాబాపూర్, గంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హరిత తనిఖీ చేశారు. పీహెచ్సీలోని ఫార్మాసీ, ల్యాబ్ రూమ్, జనరల్ వార్డులను పరిశీలించారు. దవాఖాన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డా.రాజ్కుమార్కు సూచించారు. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషియన్, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించి 9 గంటలకు పీహెచ్సీలో ఉండాలని సూచించారు. లేదంటే చర్యలు తప్పవన్నారు.
పీహెచ్సీ పరిధిలోని సబ్ సెంటర్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండాలని అన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం దిందా-కేతిని వాగుపై చేపట్టిన హైలెవెల్ వంతెన నిర్మాణ పనులు పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలన్నారు. దిందా గ్రామానికి రెండు వైపులా ఉన్న వాగుతో పాటు మహారాష్ట్ర సరిహద్దులో గల ప్రాణహిత నదిని సందర్శించి స్థానికులను నీటి ప్రవాహం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మండల స్థాయి అధికారి సహా స్థానిక అధికారులెవరు కనిపించకపోవడం గమనార్హం.
చెక్పోస్టు విధులు పకడ్బందీగా నిర్వర్తించాలి
సిర్పూర్(టీ), మే 6 : చెక్పోస్టుల వద్ద పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పకడ్బందీగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. బుధవారం మండలంలోని పెద్దబండలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును తనిఖీ చేసి, రిజిస్టర్లను పరిశీలించారు. పొరుగు రాష్ర్టాల నుంచి మత్తు పదార్థాల అక్రమ రవాణా, ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలు, గడ్డి మందులు, వరిధాన్యం అక్రమంగా రవాణా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో చెక్పోస్ట్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.