నిర్మల్, మే 8(నమస్తే తెలంగాణ) : పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నది. పక్షం రోజులుగా ప్రచారాన్ని వేగవంతం చేస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. కొంత మంది ఇతర పార్టీల్లో చేరుతున్నప్పటికీ కార్యకర్తలు మాత్రం మనోధైర్యాన్ని కోల్పోకుండా బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తున్నారు. కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్కు చెందిన కొంతమంది సీనియర్ నాయకులు పార్టీకి వెన్నుపోటు పొడిచి, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని, అలాంటి వారు ప్రచారానికి వస్తే నిలదీయాలంటూ వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నదని, దీనిని ప్రజలందరూ గుర్తించాలంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.
నిర్మల్ నియోజకవర్గంలో జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మీ, నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్రెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు రాము, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సుభాష్రావు ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ముథోల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు పడకంటి రమాదేవి, కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాంసుందర్, విలాస్ గాదేవార్లు మండలాలవారీగా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నీతానై ప్రచార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా లంబాడాలను కలుస్తూ బీఆర్ఎస్ మద్దతునిచ్చేలా ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దీటైన సమాధానమిస్తూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారానికి జనం జేజేలు కొడుతున్నారు. బీఆర్ఎస్కు అడుగడుగునా వస్తున్న జనాదరణను చూసి ఇతర పార్టీల నాయకులు అయోమయానికి గురవుతున్నారు. బీఆర్ఎస్ ప్రచార వేడిని ముమ్మరం చేయడంతో శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నది.
నేడు జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేసే వ్యూహంలో భాగంగా అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నది. ఈ నెల 9(గురువారం)న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా భైంసాకు చేరుకుంటారు. అక్కడ రోడ్ షోలో పాల్గొని యూనియన్ బ్యాంక్ కూడలి వద్ద జరిగే రోడ్ షోలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు మంచిర్యాల చౌరస్తాలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అయితే కేటీఆర్ రోడ్ షోలకు జనాన్ని పెద్ద ఎత్తున సమీకరించేందుకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం నిర్మల్లో ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో జరిగిన బూత్ లెవల్ పార్టీ కార్యకర్తల సమావేశానికి వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలిరావడం ఆ పార్టీకి ఊపునిచ్చిందంటున్నారు.
కేటీఆర్ రాకతో మారనున్న ప్రచారపర్వం
బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ దీటైన ప్రసంగాలకు జనం ఆకర్షితులయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్, కేటీఆర్ ప్రసంగాలకు జనాదరణ లభిస్తున్నట్లుగానే నిర్మల్ జిల్లాలో కూడా అదే రకమైన స్పందన లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు బీఆర్ఎస్ వర్గాలు సోషల్ మీడియాను ప్రధాన ప్రచార వేదికగా మార్చుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్లు ప్రచారంలో వెనుకబడి ఉండడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఉదయం నుంచి సాయం త్రం వరకు బీఆర్ఎస్ నేతలంతా ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన సంక్షేమ, లభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న అన్యాయా న్ని ఎండగడుతున్నారు. ఆశించిన రీతిలో ఓటర్లు బీఆర్ఎస్ నేతలను ఆదరిస్తుండడం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తున్నది.
హెలిప్యాడ్ స్థలం పరిశీలన
భైంసాలో గురువారం నిర్వహించనున్న రోడ్ షోకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ సం దర్భంగా బుధవారం పట్టణంలోని ధనంజయ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ముథోల్ సమన్వయ కమిటీ సభ్యురాలు రమాదేవి, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, విలాస్ గాదేవార్, కిరణ్ కొమ్రేవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. సాయంత్రం ఐదు గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుందన్నారు. అనంతరం పాత పోస్టాఫీసు సమీపంలో కేటీఆర్ ప్రసంగిస్తారన్నారు.