Maa inti Bangaram | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన సూపర్హిట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసి రూ.100 కోట్ల క్లబ్లో చోటు దక్కించుకున్న ఈ చిత్రం, తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మా ఇంటి బంగారం’ కేవలం 28 రోజులకే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి రావడం విశేషం. సాధారణంగా భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలకే త్వరగా ఓటీటీ రిలీజ్ లభించే పరిస్థితుల్లో, మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు స్క్రీన్ప్లే అందించారు. భావోద్వేగాలు, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మహిళా ప్రధాన తెలుగు చిత్రాల్లో కొత్త రికార్డు సృష్టించింది.ఈ చిత్రంలో సమంత ‘స్వర్ణ’ పాత్రలో కనిపించింది. పెళ్లి తర్వాత తొలిసారి భర్త ఇంటికి వెళ్లిన ఓ యువతి, కొత్త కుటుంబంలో కలిసిపోవడానికి ప్రయత్నించే సమయంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. గత జీవితానికి సంబంధించిన ఓ రహస్యం ఆమె జీవితాన్ని మలుపుతిప్పుతుంది. కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వర్ణ చేసిన పోరాటమే సినిమా ప్రధాన కథ.
భావోద్వేగ సన్నివేశాలతో పాటు సమంత చేసిన యాక్షన్ ఎపిసోడ్లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత స్వయంగా రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురుతో కలిసి నిర్మించారు. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సమంత మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, శ్రీముఖి, మంజూష ముళ్లపూడి, గౌతమి కీలక పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘మా ఇంటి బంగారం’ ప్రస్తుతం జియో హాట్స్టార్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. జూలై 17 అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. .