వాషింగ్టన్, జూలై 16 : అమెరికాలో 3.3 లక్షల మందికిపైగా భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులు త్వరలో కఠినమైన వలస నిబంధనలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని తొలగించి దాని స్థానంలో నిర్ణీత కాల నివాసాన్ని ప్రవేశపెట్టే నిబంధనను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ఖరారు చేసిన నేపథ్యంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. గురువారం విడుదలైన కొత్త నిబంధన కింద ఎఫ్-1 వీసాలపై ఉన్న విద్యార్థులు సాధారణంగా అమెరికాలో గరిష్ఠంగా నాలుగేండ్లపాటు ఉండేందుకు అనుమతిస్తారు. తమ చదువులను పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమైన వారు తమకు అనుమతించిన బస గడువు ముగిసేలోపు డీహెచ్ఎస్ నుండి గడువు పొడిగింపును పొందవలసి ఉంటుంది. ఈ నిబంధన జే-1 ఎక్సేంజ్ విజిటర్లు, విదేశీ మీడియా ప్రతినిధులకు జారీ చేసే 1-వీసాదారుల బస కాలపరిమితిని కూడా నిర్దేశిస్తుంది. ఇది అమల్లోకి రావడానికి ముందు కాంగ్రెస్ పరిశీలన పొందాల్సి ఉంటుంది. వీసా వ్యవస్థపై పర్యవేక్షణను బలోపేతం చేయడం, జాతీయ భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించడమే ఈ మార్పుల లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. అయితే, నాలుగేండ్లకు మించి విద్యా కార్యక్రమాలు కొనసాగించే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఈ నిబంధన అనిశ్చితిని సృష్టించవచ్చని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు హెచ్చరించాయి.
అమెరికాలో ప్రస్తుతం అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థుల సమూహంగా ఉన్న భారతీయ విద్యార్థులపై ఈ నిబంధన గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ‘ఓపెన్ డోర్స్ 2024’ నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 3.31 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చేరారు. ఆ దేశంలోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో వీరు దాదాపు 30 శాతం మంది ఉన్నారు. చాలామంది భారతీయ విద్యార్థులు పూర్తి చేయడానికి నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టే కోర్సులను అభ్యసిస్తారు. వీటిలో డాక్టరేట్ డిగ్రీలు, పరిశోధన ఆధారిత మాస్టర్స్ ప్రోగ్రామ్లు, వైద్య శిక్షణ, ఇంజనీరింగ్ పరిశోధన, ఇతర ప్రత్యేక వృత్తిపరమైన కోర్సులు ఉన్నాయి. కొత్త విధానం ప్రకారం చట్టబద్ధంగా తమ చదువును కొనసాగించాలనుకుంటే ఈ విద్యార్థులు తమకు అనుమతించిన బస గడువు ముగిసేలోపు డీహెచ్ఎస్ నుండి గడువు పొడిగింపును పొందాల్సి ఉంటుంది. అయితే అనుమతించిన బస గడువు ముగిసేలోపు విద్యార్థి గడువు పొడిగింపును పొందడంలో విఫలమైతే ఏమవుతుందనేదే ప్రస్తుత ప్రధాన ఆందోళన. ప్రస్తుత విధానానికి భిన్నంగా చట్టబద్ధమైన నివాస గడువు ముగిసిన విద్యార్థులు వెంటనే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్నట్లు గుర్తింపును పొందడం ప్రారంభమవుతుంది. గడువు పొడిగింపును సకాలంలో ఆమోదించకపోతే పరిపాలనాపరమైన జాప్యాలు, ప్రాసెసింగ్లో పేరుకుపోయిన పనులు లేదా పత్రాలలోని తప్పులు కూడా విద్యార్థులను తాత్కాలికంగా చట్టపరమైన హోదా లేకుండా చేయగలవు. డీహెచ్ఎస్ ఈ నిబంధనను ఖరారు చేసినప్పటికీ ఇది వెంటనే అమల్లోకి రాదు. దీని అమలు తేదీని ప్రకటించే ముందు ఈ నిబంధన తప్పనిసరిగా కాంగ్రెస్ పరిశీలనకు లోబడి ఉంటుంది.
అమెరికాలో శాశ్వత నివాసం కల్పించే గ్రీన్కార్డ్ కోసం దరఖాస్తు చేసుకొనేవారు లక్ష డాలర్ల (సుమారు రూ.96 లక్షలు) బాండ్ (పూచీకత్తు) చెల్లించాలనే ప్రతిపాదనను ట్రంప్ సర్కార్ పరిశీలిస్తున్నట్టు వాల్స్ట్రీట్ పత్రిక వెల్లడించింది. ఈ ప్రతిపాదనను అధికారికంగా ఇంకా ఖరారు చేయనప్పటికీ వలసదారులకు ఇది మరిన్ని ఇబ్బందులు కలిగిస్తుందని అంటున్నారు. ఇప్పటికే గ్రీన్కార్డ్ కోసం భారత్కు చెందిన వారే లక్షల మంది దశాబ్దాలుగా వేచి చూస్తున్నారు. ఆయా దేశాల్లోని అమెరికన్ రాయబార కార్యాలయాల ద్వారా గ్రీన్కార్డ్ కోసం దరఖాస్తు చేసుకొనేవారు తమకు ఆమోదం లభించేవరకూ లక్ష డాలర్ల నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్కార్డ్ పొందిన విదేశీయులు అమెరికాలో చట్టబద్ధమైన పౌరులుగా నివసించవచ్చు. ఈ నగదు డిపాజిట్ చేసే నిబంధనను కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఇప్పటికే అమెరికాలో నివాసముంటున్నవారు తమ కుటుంబ సభ్యుల కోసం లక్ష డాలర్లు డిపాజిట్ చేయవచ్చు. దరఖాస్తుదారులకు గ్రీన్కార్డ్ లభించగానే ఆ సొమ్మును వాపస్ చేయనున్నారు. ఈ నిబంధన భారతీయులపైనే ముఖ్యంగా ఉపాధి ఆధారిత వీసాల కోసం ఎదురుచూస్తున్న వారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అమెరికన్ ప్రభుత్వం ఏటా 1.40 లక్షల గ్రీన్కార్డ్లను జారీ చేస్తున్నది. పరిమిత సంఖ్యలో జారీచేస్తున్న ఈ వీసాలలో ఒక్కో దేశానికి ఏడు శాతం వరకు లభిస్తున్నాయి. దీంతో భారతీయులకు ఏటా 9,800 వీసాలు మాత్రమే దక్కుతున్నాయి. గ్రీన్కార్డ్ కోసం వేచి ఉన్న భారతీయుల సంఖ్య 10 లక్షలు దాటింది.