నిర్మల్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : ‘నిర్మల్ జిల్లా కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది.’ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి అల్లోల మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. కొత్తగా నర్సాపూర్(జీ), నిర్మల్ రూరల్, సోన్ మండలాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇటీవలే పొనకల్ మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారని, పొనకల్ మండల ప్రజల తరఫున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
మంత్రి కేటీఆర్ సాకారంతో నిర్మల్ నియోజకవర్గంలో రూ.1,157 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం, శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందన్నారు. శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఎత్తిపోథల పథకాన్ని ప్రారంభించుకోవడం ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ ఎత్తిపోతల పథకం పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.714 కోట్లను ఖర్చు చేసిందన్నారు. పాత పోచంపహాడ్ శివారులో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. ఇటీవలే మెడికల్ కళాశాలను ప్రారంభించుకున్నామని, తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. మెడికల్ కళాశాలతో నిర్మల్లో 350 పడకలు అందుబాటులోకి వచ్చాయని, దీనితో ఈ ప్రాంతం ఒక మెడికల్ హబ్గా మారనుందన్నారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ది పథంలో దూసుకుపోతున్నదని, సీఎం కేసీఆర్తోనే ప్రగతి సాధ్యమైందన్నారు.
దిలావర్పూర్/సారంగాపూర్/లక్ష్మణచాంద, అక్టోబర్ 4 : బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా దిలవార్పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామం లో ప్యాకేజీ-27 ఎత్తిపోతల పథకాన్ని మంత్రి కేటీఆర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పటు చేసిన సమావేశంలో అల్లోల మాట్లాడారు. తాను 25 ఏండ్ల నుంచి రాజకీయంగా సేవలందిస్తున్నాని, ఈ తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి ఎప్పుడూ కాలేదన్నారు. ప్యాకేజీ-27లో భాగంగా మూడు కెనాల్స్(స్వర్ణ, కుంటాల, మరో కెనాల్) ద్వారా దిలావర్పూర్ మండల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. మాటేగాం గుట్ట మీద ఉన్న 1500 ఎకరాల భూములకు సాగునీరు అందుతుందన్నారు. ఒకప్పుడు గుట్టమీది భూములకు రూ. 5 వేల నుంచి రూ.10 వేల ధర ఉండేదని.. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడం ద్వారా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెరిగిందన్నారు. ఎత్తిపోతల పథకం కింద ఉన్న గ్రామాల చెరువులకు కూడా నీరు వెళ్తుందన్నారు.
సోన్, అక్టోబర్ 4 : సమైక్యాంధ్రలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొమ్మిదేళ్లలో చేసి చూపించిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్ మండలం పోచంపాడ్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడం ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో పది వేల ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగవుతోందన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని తమ ప్రాంతంలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు విన్నవించిన వెంటనే రూ.300 కోట్లతో ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పడం మన అదృష్టమన్నారు. 40 ఎకరాల్లో ఏడాదిన్నరలో ఫ్యాక్టరీని పూర్తి చేసి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఒకేరోజు నిర్మల్ జిల్లాలో రూ. 1100 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించడం ఎంతో హర్షణీయమని తెలిపారు.