“నిర్మల్ పర్యటనకు వస్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి పట్టణాన్ని వీక్షిస్తే అద్భుతంగా అనిపించింది. ఆ కలెక్టరేట్, రెండు పడకల ఇండ్లు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్ భవన నిర్మాణాలు అబ్బుర పడేలా ఉన్నాయి.. పదిహేనేండ్ల క్రితం చూసిన నిర్మల్కు.. ఇప్పుడు చూస్తున్న నిర్మల్కు చాలా తేడా ఉంది..’ అని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఉద్ఘాటించారు. బుధవారం నిర్మల్ పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-27 ఎత్తిపోతల పథకం, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, పలు అభివృద్ధి పనులకు మంత్రి అల్లోలతో కలిసి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పట్టణాభివృద్ధి ప్రణాళికాబద్ధంగా రైతులకు నష్టం జరుగకుండా చూస్తామన్నారు. తప్పకుండా మీ అందరితో సంప్రదించాకే.. ఏమన్న అభ్యంతరాలు ఉంటే వాటిని కూడా పరిష్కరించేలా చేస్తా అని పేర్కొన్నారు. ఎవరికీ కూడా అన్యాయం జరగని వ్వమన్నారు. వచ్చే ఎన్నికల్లో జాన్సన్ నాయక్, అనిల్ జాదవ్ను.. అల్లోల, రామన్న, విఠల్రెడ్డిలను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
– మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ)
సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు, నిత్యం జనం మధ్య ఉండే జననేత, అన్న ఇంద్రకరణ్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలి. అల్లోలతోపాటు విఠల్రెడ్డి, జాన్సన్ నాయక్లను కూడా గెలిపించి, మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలి. నిర్మల్ జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడం, ప్యాకేజీ 27 పనులు పూర్తి కావడం, నిర్మల్ జిల్లా ఏర్పాటుకావడం తమ ప్రభుత్వ ఘనతే. మచ్చలేని నాయకుడు ఇంద్రకరణ్రెడ్డికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
– ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు కేటీఆర్
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఒకేరోజు నిర్మల్ జిల్లాలో రూ.1100 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. సోన్ మండలంలోని పోచంపాడ్ గ్రామంలో 40 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం హర్షణీయం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు విన్నవించిన వెంటనే ఫ్యాక్టరీని మంజూరు చేయడం మన అదృష్టం.
– అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : ‘నిర్మల్ జిల్లా పర్యటన కోసమని హెలికాప్టర్ లో దిగుతుంటే.. కలెక్టరేట్, పక్కనున్న రెండు పడకల ఇండ్లు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్ను చూసిన. జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూస్తే నాకే అబ్బురం అనిపించింది.’ అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు. నిర్మల్ జిల్లాలో బుధవారం పర్యటించిన మంత్రి కేటీఆర్ దిలావర్పూర్ మండలంలోని గుండం పెల్లిలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ప్యాకేజీ -27 ఎత్తిపో తల పథకాన్ని ప్రారంభించారు. సోన్ మండలంలోని పాత పోచంపాడు శివారులో నిర్మించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రగతి నివేదిక సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ఒకసారి 2014లో అధికారంలోకి వచ్చిన నాడు నిర్మల్ పరిస్థితి ఏంది? ఇవాళ పరిస్థితి ఏంది? ఒక్కసారి ఆలోచన చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మనసు పెట్టి గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలని స్పష్టం చేశారు. 2014లో కరెంట్, తాగు, సాగునీటి పరిస్థితి ఎట్లా ఉండే, ఇవాళ ఎైట్లెందో ఆలోచన చేయాలన్నారు. అన్నం ఉడికిందా లేదా తెలుసుకునేందుకు కుండ లోపల చేయి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క మెతుకు ముట్టుకుంటే సాలు తెలిసిపోతది అన్నం ఉడికిందా లేదా అని తెలిపారు. ఐకే రెడ్డి రెండు సార్లు మంత్రి అయ్యిండు. ఏం చేసిండు నిర్మల్కు అని అడిగితే ఒకటే చెప్పాలన్నారు.
ఇది వరకు 2014కు ముందు ఏదన్న కష్టం వస్తే జిల్లా కలెక్టర్ దగ్గరికో, ఎస్పీ దగ్గరికో, జిల్లా అధికారి దగ్గరికో పోవాలంటే 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం ఆదిలాబాద్కు పోవాల్సి వస్తుండేదని, ఐకే రెడ్డి నాయకత్వంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఈ రోజు నిర్మల్ జిల్లా అయ్యింది. ఖానాపూర్, ఉట్నూర్, కడెం, దిలావర్పూర్, సారంగాపూర్, మామడ నుంచి అక్కడెక్కడో ఆదిలాబాద్కు పోవాల్సిన అక్కర లేకుండా.. మీ నిర్మల్కే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు వచ్చారన్నారు. చాలా రాష్ర్టాల్లో సెక్రెటేరియట్లు కూడా లేని విధంగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఉందన్నారు. కేవలం అధికారుల కోసం కట్టుకున్న భవనాలు కాకుండా, దాని పక్కనే ఉన్న 2,500 డబుల్ బెడ్రూం ఇండ్లు బ్రహ్మాండంగా కట్టుకున్నామన్నారు.
నిర్మల్ జిల్లాలో కరెంట్ కష్టాలు తీర్చామన్నారు. రూ.1000 కోట్ల పైచిలుకు నిధులతో చాలా సబ్స్టేషన్లు నిర్మించుకున్నామని తెలిపారు. గతంలో తాగునీటి కోసం ఎంత గోస ఉండేదన్నారు. మా ఆడబిడ్డలు రోడ్ల మీదకు వచ్చి యుద్ధాలు చేయక తప్పని పరిస్థితి ఉండేది. ట్యాంకర్ వస్తే మా నిర్మల్ పట్టణంలో, ఖానాపూర్ పట్టణంలో గుమిగూడి యుద్ధాలు చేసే పరిస్థితి ఈ రోజు ఉందా? ఆలోచించాలన్నారు. ఇంటింటికీ నల్లాపెట్టి నీళ్లు ఇస్తా.. నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగ.. అని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప.. ఈ దేశంలో ఎవరన్న ఉన్నరా.. ఒక్క సారి ఆలోచన చేయాలన్నారు.
తెలంగాణ వచ్చాక రూ.200 ఉన్న పింఛన్ రూ.2వేలు అయ్యిందని, కాంగ్రెసోడు ఉన్నప్పుడు రూ.200 ఉండే ఇవాళ రూ.2వేలు అయ్యిందా కాలేదా.. చూడాలన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 29 లక్షల మందికి పింఛన్లు వస్తే ఇవాళ 46 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయన్నారు. దివ్యాంగులకు భారతదేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా రూ.4వేల పింఛన్ ఇచ్చే మనసున్న ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు. మా నిర్మల్, ఖానాపూర్లో బీడీలు చుట్టే అక్కా చెల్లెళ్లు ఎంతో మంది ఉన్నారని, కానీ.. ఎన్నడన్న ఎవ్వరన్న ఓ ముఖ్యమంత్రి, ఓ నాయకుడు బీడీలు చుట్టే అక్కాచెల్లెళ్ల గురించి ఆలోచన చేశారా.. ఆలోచించాలన్నారు. కానీ.. మాకు ఎవరు వచ్చి దరఖాస్తు ఇవ్వకున్నా 4.25 లక్షల మంది బీడీలు చుట్టే అక్కాచెల్లెళ్లకు, టేకేదారులకు నెలకు రూ.2వేల పింఛన్ ఇస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.1,00,116 ఇస్తున్నామన్నారు.
స్వరాష్ట్రంలో విద్య, వైద్యం మంచిగ అయ్యిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 1001 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నామని, ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఒక్కో విద్యార్థి మీద రూ.1.25 లక్షలు ఖర్చు పెడుతున్నామన్నారు. విద్యార్థుల కోసం బూట్లు, బట్టలు, పుస్తకాలు, బ్యాగ్లు, దుప్పట్లు అన్ని ప్రభుత్వమే సదిరి, వాళ్లకు సన్న బియ్యంతో బువ్వ పెట్టి.. చదివించుకుంటున్నామని గుర్తు చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ.20 లక్షలు వేలాది మందికి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. ఒకప్పుడు నిర్మల్, ఖానాపూర్లో ఆడపిల్లలు ప్రసూతి కోసం సర్కార్ దవాఖానకు పోయేదికాదన్నారు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు.. ఆడికిపోతే సావకొడుతరు, చంపేస్తరు.. ఏ సవులతు సక్కగ ఉండదు.
ఆగం చేస్తరని చెప్పి నేను పోను సర్కార్ దవాఖానకు అని సినిమా పాటకు గుర్తు చేసుకునేటోళ్లు, ఇవాళ అదే సర్కార్ దవాఖానకు పోతా. అక్కడ ప్రసూతైతే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కిట్టు వస్తది. ఆడపిల్ల పుడితే రూ.15 వేలు, మగపిల్లగాడు పుడితే రూ.12వేలు వస్తయని ఆడబిడ్డలు అంటున్నారన్నారు. ఇదే నిర్మల్ జిల్లాలో, ఇదే తాలూకాలో ఇదే ఇంద్రకరణ్రెడ్డి.. ఆనాడు ఒక జూనియర్ కాలేజీ కోసం, ఒక డిగ్రీ కాలేజీ కోసం ధర్నాలు చేశారన్నారు. యుద్ధాలు చేస్తే ఓ జూనియర్ కాలేజీ వస్తుండేనని, మరి ఈ రోజు ఏంది పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. కలలోనైనా అనుకున్నామా.. మన దగ్గరకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తుందని, ఇంద్రకరణ్రెడ్డి తెస్తరు.. కేసీఆర్ ఇస్తరు అని ఎవరన్న కలగన్నరా చెప్పాలన్నారు. ఈ రోజు మన పిల్లలు డాక్టర్లు అయ్యేందుకు హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్కో పోయే అవసరం లేదని, మన నిర్మల్ మెడికల్ కాలేజీలో మన పిల్లలు చదువుకునేట్లు మీ దగ్గరనే కాలేజీ వచ్చిందన్నారు. నిర్మల్లో 350 పడకల పెద్ద ఆసుపత్రి అంటే మాములు విషయం కాదన్నారు. క్యాన్సర్, గుండె జబ్బు, కిడ్నీ రోగమైనా, ఇంకేదైనా సమస్య ఉన్నా హైదరాబాద్కు పోయే అవసరం ఇకపై ఉండదన్నారు. ఖానాపూర్, నిర్మల్, ముథోల్ ఎవరైనా సరే సీదా ఈడకు వస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్య అయినా ఇక్కడే పరిష్కారం అవుతుందన్నారు.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ గురించి ఆగమాగం చేసిండ్రు, గందళగోళం చేసిండ్రు ఇక్కడి నాయకులు అని ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. నేను వారితో ఒకటే చెబుతున్నా.. నిర్మల్ జిల్లా కేంద్రమైంది. మంచిగ చేసుకోవాలే. ప్రణాళికాబద్ధంగా పని చేసుకోవాలే. ఆగం కావొద్దు. రెచ్చగొట్టేటోళ్లు ఎప్పటికీ ఉంటరు. కానీ.. పట్టణం అనేది మన కోసం కాదు. మనం పోయాక మన పిల్లలు కూడా ఉంటరు. పట్టణాభివృద్ధి ప్రణాళికాబద్ధంగా రైతులకు నష్టం జరుగకుండా ఉండాలి. తప్పకుండా మీ అందరితో సంప్రదించాకే.. ఏమన్న అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించేలా చేస్తాం తప్ప.. ఆగమాగం ఏం చేయం. ప్రజలందరికీ చెప్పండి ఎవరికీ కూడా అన్యాయం జరగకుండా చేస్తాం. ఆ విషయంలో అనుమానం వొద్దు అన్నారు. నేను పదిహేను ఏండ్ల కింద చూసిన నిర్మల్కు ఇప్పుడున్న నిర్మల్కు పోలిక లేదన్నారు. ఎవరన్న కొత్తగా దుబాయ్ నుంచో వేరే దగ్గరి నుంచో వస్తే ఇది మా ఊరేనా.. వేరే ఊరా అని మర్చిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు. అంత బాగైంది నిర్మల్ అంటూ కితాబిచ్చారు.
నిర్మల్తో పోలిస్తే ఖానాపూర్ వెనుకబడ్డదని మంత్రి కేటీఆర్ అన్నారు. తమ్ముడు జాన్సన్ను గెలిపిస్తే అభివృద్ధిలో ఖానాపూర్ నిర్మల్తో పోటీపడేలా చేస్తానని మాటిచ్చారు. జాన్సన్ను మంచి మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపాలన్నారు. అదేవిధంగా బోథ్ నుంచి అనిల్ జాదవ్, ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, నిర్మల్ నుంచి ఐకే రెడ్డి, ముథోల్ నుంచి విఠల్రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన పొనకల్, మాలేగాం, బేల్ తరోడా మండలాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గం ఇక్బాల్పూర్ చెక్పోస్ట్ దగ్గర టోల్ తీసేయాలని జాన్సన్ అడిగారని, దీనికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కూడా ఓకే అన్నారన్నారు. త్వరలోనే అది కూడా అవుతుందన్నారు. సభలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముథోల్ నియోజకవర్గ శాసన సభ్యులు విఠల్రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్, బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్, ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్, నిర్మల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి-రాంకిషన్రెడ్డి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ ఎంపీ నగేశ్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, యువనాయకుడు అల్లోల గౌతమ్రెడ్డి, పైడిపల్లి రవీందర్రావు, మురళీధర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి పాల్గొన్నారు.