లక్ష్మణచాంద, డిసెంబర్ 20 : మండలంలోని ధర్మారం గ్రామంలో కోతిదేవుని జాతర మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. కోతిదేవుడి దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గర్భగుడిలోని కోతిదేవుడి సమాధిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు బారులు తీరారు.
జాతరలో వెలిసిన జాయింట్ వీల్, ఆట పరికరాల వద్ద పిల్లలు, పెద్దలు సరదాగా గడిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. జాతరలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్ఐ రాహుల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల పాటు కొనసాగిన జాతర ప్రశాంతంగా ముగిసింది.