కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఆగస్టు 7 న నిర్వహించబోయే ఎస్ఐ పోస్టుల నియామక పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నియమావళి మేరకు పరీక్ష కేంద్రల నిర్వాహకులకు జిల్లా పోలీస్ కేంద్రంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియామక పరీక్ష రీజినల్ కో-ఆర్డినేటర్ డా.శ్రీధర్ సుమన్ పరీక్ష కేంద్రాల్లో వసతుల గురించి చీఫ్ సూపరింటెండెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసారు. జిల్లా వ్యాప్తంగా 1492 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ రాతపరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.
ఈ పరీక్షలు ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు నిర్వహించాలన్నారు.ఎస్పీ కె. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఫర్నీచర్, గాలి, వెలుతురు, నీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు.
బయోమెట్రిక్ హాజరు ఆలస్యం కాకుండా తగు ప్రణాళికతో సమయ పాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ నోడల్ అధికారి అచ్చేశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.