కాగజ్నగర్ టౌన్, జూన్ 19 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం నజ్రుల్నగర్ విలేజ్ నంబర్ 1 గ్రామానికి చెందిన అ న్నదమ్ములు రణధీర్ హల్దార్, సంజీత్ హల్దార్ విగ్రహాలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రకు ఆర్డర్లపై ప్రతిమలను రూపొందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉన్నతంగా చదువుకోకపోయినా దీనినే వృత్తిగా ఎంచుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ కళాకారులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
తండ్రి నుంచి శిక్షణ..
విలేజ్ నంబర్1కు చెందిన రణధీర్ హల్దార్, సంజీత్ హల్దార్ది వ్యవసాయ కుటుంబం. వీరి తండ్రి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు సహాయంగా ఉండేవారు. ఆయన వద్దే శిక్షణ పొందారు. వరి గడ్డి, కర్రలతో మట్టి విగ్రహాల తయారీ నుంచి ఇనుప రాడ్డు ముక్కలు, సిమెంటుతో అందమైన విగ్రహాలను కళ్లకు కట్టినట్లు తయారు చేస్తున్నారు. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేకంగా మట్టి విగ్రహాలను తయారు చేస్తారు. వినాయకుడు, కాళికాదేవి, దుర్గామాత, సరస్వతీ దేవి తదితర మట్టి ప్రతిమలను తయారు చేసి విక్రయిస్తారు. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, జ్యోతిబాఫూలే, సావిత్రి బాయి ఫూలే, మహత్మా గాంధీ, కుమ్రం భీం, వన్యప్రాణులు, వివిధ రకాల విగ్రహాలే కాకుండా అమరుల ఫొటోలను చూసి, అచ్చుగుద్దినట్లుగా తయారు చేస్తారు. వీరి పని తనం జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, కరీంనగర్, తదితర ప్రాంతాలకు తెలియడంతో ఆర్డర్లను పొందుతూ యేడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు.
రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు..
5 అడుగుల సిమెంటు విగ్రహాల తయారీకి 15 రోజుల సమయం పడుతుంది. ఒక్కోదానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ధర ఉంటుంది. చిన్న విగ్రహాల తయారీకి రెండు మూడు రోజుల సమయం పడుతుంది. మందమర్రి, గోలేటి ప్రాంతాల్లోని పల్లె పకృతి వనాలు, పార్కుల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల బొమ్మలు వీరు తయారు చేసినవే.
వృత్తిగా ఎంచుకున్నాం..
మా నాన్న గారి నుంచి మట్టి విగ్రహాల తయారీ నేర్చుకున్నాం. అలా పండుగల సమయాల్లో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నాం. ప్రస్తుతం సిమెంటు, రాడ్డు, గడ్డి ఉపయోగించి విగ్రహలను తయారు చేస్తున్నాం. ఆర్డర్లపై 30 రోజుల్లో విగ్రహాన్ని తయారు చేసి అందజేస్తున్నాం. ఇప్పటి వరకు మందమర్రి, గోలేటి పార్కుల్లో ఆర్డర్లపై వన్యప్రాణుల బొమ్మలను తయారు చేసి ఇచ్చాం.
– సంజీత్ హల్ధార్, కళాకారుడు
20 ఏండ్లుగా చేస్తున్నాం..
20 ఏండ్లుగా విగ్రహాలను తయారు చేస్తున్నాం. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగ ఉత్సవాల సందర్భంగా వినాయకుడు, దుర్గామాత, సరస్వతీ దేవి, కాళీమాత విగ్రహాలను తయారు చేస్తున్నాం. విగ్రహాల తయారీనే వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నాం. 5 ఫీట్ల సిమెంటు విగ్రహాన్ని 30 రోజుల్లో పూర్తి చేస్తాం. రూ.20 వేల వరకు ఆదాయం వస్తుంది
– రణధీర్ హల్ధార్, కళాకారుడు