నారు పోసి.. నాటు వేయకుండానే పంట చేతికి
ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ lకూలీల అవసరమే లేదు
మంచిర్యాల జిల్లాలో 3000 ఎకరాల్లో సాగు
ఆసక్తి చూపుతున్న రైతాంగం
మంచిర్యాల, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ) : ‘డ్రమ్ సీడర్’ అన్నదాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నది. ఈ విధానంతో అనేక ప్రయోజనాలు ఉండగా, రైతాంగం ఆసక్తి చూపుతున్నది. మామూలు వరి సాగుకంటే పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ. నారు పోసి.. నాటు వేయకుండానే పంట చేతికొస్తుంది. కూలీలు, కలుపు, పురుగు మందుల ఖర్చులు మిగలడంతో పాటు సమయం కూడా కలిసి వస్తున్నది. ఈసారి మంచిర్యాల జిల్లాలో 3000 ఎకరాలకుపైగా సాగవుతుండగా, మున్ముందు మరింత పెరిగే అవకాశమున్నదని వ్యవసాయశాఖ చెబుతున్నది.
మంచిర్యాల జిల్లాలో సుమారు 3000కు పైగా ఎకరాల్లో డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో సాగు గురించి వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తుండగా, రైతులు ఆసక్తి చూపుతున్నారు. మామూలుగా వరినారు మడులు పెడితే ఎకరానికి 25 కిలోల నుంచి 30 కిలోల వరకు విత్తనాలు అవసరం అవుతాయి. డ్రమ్ సీడర్ ద్వారా వరి పంట వేసేందుకు కేవలం 8 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతుంది. సాధారణ పద్ధతిలో క్వింటాలుకు ఖర్చు రూ.26 వేల వరకు అవుతుండగా, డ్రమ్ సీడర్లో రూ.15 వేలు మాత్రమే అవుతాయి. 24 గంటలు నానబెట్టిన వడ్ల సూది మొన తెల్లగా పగిలిన తర్వాత సిద్ధంగా ఉన్న పొలంలో డ్రమ్ సీడర్ లాగి విత్తుకోవాలి. డ్రమ్సీడర్ ద్వారా వరినాట్ల సమస్య తప్పుతుంది. పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. సమయం, కూలీల ఖర్చు కలిసి వస్తుంది. దిగుబడి పెరుగుతుంది. చీడపీడల ఉధృతి తగ్గుతుంది. వరి డ్రమ్ సీడర్ ద్వారా నాటడంతో మొక్క మొక్కకూ దూరం సమానంగా ఉంటుంది. డ్రమ్ సీడర్ ద్వారా వరిని నేరుగా విత్తుకోవచ్చు. డ్రమ్ సీడర్ ద్వారా వరి నాట్లు వేసే అవసరం ఉండ దు. తద్వారా నాట్లు వేసే కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు.డ్రమ్ సీడర్ ద్వారా వేసిన వరి పొలంలో ఒక చదరపు మీటర్కు ఎన్ని మొక్కలు ఉండాలో అన్ని మొక్కలు మాత్రమే ఉంటాయి. తద్వా రా పంట ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా వరి పంట ఒక ఐదారు రోజులు ముందుగానే కోతకు వస్తుంది.
నేల తయారీ.. తీసుకోవాల్సిన చర్యలు
ఈ పద్ధతి ద్వారా సాగు చేసేటప్పుడు నేలను చదునుగా సమాంతరంగా ఉండేలా సిద్ధం చేసుకోవాలి. విత్తే సమయానికి ఆరుతడి బురదగా ఉంటే సరిపోతుంది. డ్రమ్ సీడర్ ద్వారా వేసిన పొలం లో వరుస వరుసకూ 20 సెంటీమీటర్లు ఖాళీ ఉంటుంది. అలాగే ఒక్క కుదురుకు 5 నుంచి 8 సెంటీమీటర్లు దూరం ఉంటుంది. డ్ర మ్ సీడర్ ద్వారా ఒక్కసారి లాగితే 8 వరుసలలో విత్తనాలు పడుతాయి. ప్రతి 16 వరుసలకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు వదలాలి. దీంతో సుడి దోమ ఉధృతి తగ్గుతుంది. గాలి, వెలుతురు సక్రమంగా అందుతుంది. మామూలుగా వరిసాగు చేస్తే ఎకరానికి 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. నేరుగా విత్తనాలు విత్తుకునే పద్ధతిలో సాగు చేస్తే దాదాపు 50 బస్తాల వరిధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మామూలు సాగులో పంట చేతికి రావాలంటే 145 రోజుల సమయం పడుతుంది. కానీ, ఈ పద్ధతిలో 125 రోజులకే పంట చేతికి వస్తుంది. సమయం ఆదా అవుతుంది. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. నీటి వినియోగం తక్కువగా ఉంటుంది.
విత్తన తయారీ..
డ్రమ్ సీడర్తో విత్తనాన్ని వేసుకోవాలనుకున్నప్పుడు కార్బండిజమ్ శీలీంధ్రానాశినిని కలుపుకోవాలి. ఒక గ్రామ్ కార్బండిజమ్ ఒక కిలో విత్తనానికి పట్టించాలి. నీటిలో 24 గంటలు నానబెట్టి మండె కట్టుకోవాలి. మొన సన్నగా పగిలిన తర్వాత విత్తనాలను విత్తుకోవాలి.
కలుపు యాజమాన్యం..
విత్తిన మూడు నుంచి ఐదు రోజుల లోపు పైరోజో సుల్ఫురాన్ ఎత్యల్ అనే గడ్డిమందును 80 నుంచి 100 గ్రాములు ఎకరాకు ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు.
ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ..
నాపేరు మద్దూరి ఓదెలు. మాది చెన్నూర్ మండలం ఓత్కుల పల్లి గ్రామం. మా ఊరి శివారులో వ్యవసాయ భూమి ఉంది. గత యాసంగిలో మూడెకరాల్లో డ్రమ్ సీడర్ విధానంలో పంట వేసిన. ఎకరానికి రూ. 15 వేల చొప్పున రూ. 45 వేల దాకా పెట్టుబడి అయ్యింది. ఎకరాకు 30 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.41,600 చొప్పున ఆదాయం వచ్చింది. డ్రమ్ సీడర్తో విధానంలో పంట వేస్తే నారుపోసి ఎదురు చూసే పని ఉండదు. కూలీలు, నారుకు పెట్టే ఖర్చు మిగులుతుంది. కలుపు సమస్య పెద్దగా ఉండదు. పురుగుల మందు పిచికారీ చేయాల్సిన పనిలేదు. శ్రమ తక్కువగా ఉంటుంది. దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఈసారి కూడా ఐదెకరాల్లో పంట వేసిన.
తిప్పలు తప్పినయి
నా పేరు ముల్కల శంకర్. మాది కోటపల్లి మండలం బొప్పారం. గతేడాది డ్రమ్ సీడర్ విధానంలో ఎకరంలో వరి వేసిన. 10 కిలోల విత్తనాలు వేసిన. 40 బస్తాల దిగుబడి వచ్చింది. కూలీలు, కలుపు, మందులతో కలుపుకొని రూ. 15 వేల దాకా ఖర్చులు మిగిలినయ్. ఈసారి కూడా రెండెకరాల్లో వరి వేసిన. కూలీల సమస్య లేదు. నారు పోసి ఎదురు చూసే పనిలేదు. కూలీలు అవసరం లేదు. ఈసారి పంట మంచిగనే ఉంది. ఇదివరకంటే బాగానే దిగుబడి వస్తుందనుకుంటున్న.