పల్లె ప్రజల సంపూర్ణ ఆరోగ్యంపై సర్కారు దృష్టి
100 రోజుల పాటు గ్రామాలవారీగా సర్వే
ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై సర్కారుకు నివేదికలు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు
15 రోజుల్లో ప్రక్రియ ప్రారంభించే అవకాశం
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : పల్లె ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా విలేజ్ హెల్త్ ప్రొఫైల్ పేరిట ఊరూరా సర్వే నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించడంతోపాటు ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను నమోదు చేసి నివేదికలు రూపొందించనున్నది. మరో 15 రోజుల్లో ప్రక్రియ ప్రారంభించే అవకాశముండగా, దీని ఆధారంగా ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశమున్నది.
జిల్లాలోని 15 మండలాల్లో 334 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. విలేజ్ హెల్త్ ప్రొఫైల్(గ్రామ ఆరోగ్య కరదీపిక ) పేరిట ప్రతి గ్రామంలో ప్రత్యేక సర్వే చేపట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. దీర్ఘకాలికంగా వివిధ రోగాలతో బాధపడుతున్న వారిని గుర్తించడంతో పాటు ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆర్యోగ సూచికను తయారు చేయనున్నారు. ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు పిల్లలకూ ఉన్న వివిధ వ్యాధులను గుర్తించనున్నారు. ఈ సర్వే ఆధారంగా ఏయే ప్రాంతాల్లో ఎలాంటి రోగాలు వస్తునాయి..? వీటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై నివేదికలు తయారు చేయనున్నారు.
100 రోజుల పాటు సర్వే
ఏటా ఈ సీజన్లో వ్యాధులతో పాటు కిడ్నీ, కీళ్లు, కంటి సంబంధమైన వ్యాధులు, రక్తహీనత వంటి రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతుంటాయి. విజేల్ హెల్త్ ప్రొఫైల్ పేరుతో సుమారు 100 రోజుల పాటు గ్రామాల్లో సర్వే చేసి పల్లెల ఆరోగ్యంపై కీలకమైన సమగ్ర సమాచారం సేకరించనున్నారు. దీనిని బట్టి ఆయా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనా వేస్తారు. ఆయా ప్రాంతాల్లో తరచూ వస్తున్న రోగాలకు చేయాల్సిన చికిత్సలతో పాటు రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి సమాచారం వైద్య శాఖకు ఎంతో ఉపయోగపడనున్నది.
ప్రతి రోజూ 20 కుటుంబాల ఆరోగ్యంపై..
ప్రభుత్వం విలేజ్ హెల్త్ ప్రొఫైల్ పేరుతో ప్రజల సంపూర్ణ ఆరోగ్య సమాచారాన్ని సేకరించనుంది. ప్రత్యేక వైద్య శిబిరాలలో స్థానికంగా పనిచేసే ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలతో పాటు పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని వినియోగించుకోనున్నారు. ప్రతి వైద్య శిబిరంలో రోజుకు 20 కుటుంబాల ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించి కుటుంబ ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. ఉన్న వ్యాధులను ఎలా గుర్తించాలనే అనే విషయాలతోపాటు, ఏయే విషయాలను గమనించి నమోదు చేసుకోవాలనే విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. దీర్ఘకాలికంగా బాధపడేవారికి ఎలాంటి వైద్యం అవసరం అనే సమాచారం సేకరించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజల ఆరోగ్యంపై సేకరించే సమగ్ర సమాచారం భవిష్యత్తు వైద్య సేవల విస్తరణకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఈ హెల్త్ ప్రొఫైల్ ఎంత ఉపయోకరంగా మారనుంది.