క్యాతనపల్లి మున్సిపాలిటీలో 286 ఇండ్ల నిర్మాణం
రూ. 15.15 కోట్ల వ్యయం
శరవేగంగా పనులు
వచ్చే యేడాది మార్చికల్లా పూర్తి చేసే లక్ష్యం
హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
చొరవ చూపిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
రామకృష్ణాపూర్, ఆగస్టు 21: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్కు చెందిన నిరుపేదల్లో డబుల్ దరహాస పూలు పూయనున్నాయి. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బడుగు, బలహీనవర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. అందులో భాగంగానే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు క్యాతనపల్లి మున్సిపాలిటీలో చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రూ. 15.15 కోట్లతో 286 రెండు పడకల ఇండ్ల నిర్మాణం చేపట్టారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకూడదని విప్ ఆదేశించగా, అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
286 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 2019 సెప్టెంబర్ 30న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. రూ. 15.15 కోట్ల అంచనాతో 12 బ్లాకులను నిర్మించనున్నారు. ఒక్కో బ్లాకులో 24 చొప్పున 286 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నారు. సుమారు 200 ఇండ్లు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన వాటిని కూడా మార్చి 2022 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కలల సాకారం దిశగా..
నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఆసరా పింఛన్లు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. దీంతో పాటు పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో, వారి కలలను సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కా రు ఈ ఇండ్లను నిర్మిస్తున్నది. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు వేగంగా సాగుతున్నాయి. కరోనా వేళా కొంత ఆలస్యమైనా మార్చి కల్లా వీటిని అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
-అబ్దుల్ అజీజ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ సమన్వయకర్త, రామకృష్ణాపూర్
ఆత్మగౌరవం కాపాడేలా..
ప్రస్తుత సమాజంలో బడుగు, బలహీన వర్గాల్లో చాలా కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. రోజూ కూలీ పనిచేస్తే గాని పూటగడవదు. ఇలాంటి వారు సొంతంగా ఇండ్లు నిర్మించుకొనే స్థోమత ఉండదు. ఇసొంటి పేదలు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి అందజేయడం అభినందనీయం. సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు పేద ప్రజలు రుణపడి ఉంటారు.
– జంగం కళ, మున్సిపల్ చైర్పర్సన్, క్యాతనపల్లి
డబుల్ బెడ్ ఇండ్లు పేదలకు వరం
పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాతనపల్లి మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సిద్ధం చేస్తున్నది. ఇది నిరుపేదలకు వరం. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలను పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ పేదలకు కనీస సౌకర్యాలు కలిగిన ఇల్లు ఉండాలని డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. ఇండ్లు అందుబాటులోకి వస్తే మున్సిపాలిటీలోని దళిత, బడుగు, బలహీన వర్గాల వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియనుంది. నిరుపేదల కోసం పాటు పడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
-బైరమల్ల మొగిలయ్య, అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షుడు, రామకృష్ణాపూర్