కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
ఆసిఫాబాద్, ఆగస్టు 18: రైతుల అభివృద్ధికి వ్యవసాయ విస్తరణ అధికారులు కృషి చేయాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. జిల్లాలోని ఏవోలు, ఏఈవోలతో జిల్లా కేంద్రంలో రైతు వేదిక భవనంలో బుధవారం అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి ఏఈవో స్థానికంగా ఉండి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. రైతు వేదికలే తమ కార్యాలయం అని ఏఈవోలకు గుర్తు చేశారు. జిల్లాలోని 70 క్లస్టర్లలో విధులు నిర్వహిస్తున్న వారిని నిత్యం మానిటరింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫీల్డ్ విజిట్తో పాటు రైతు వేదికల వద్ద సమావేశాలు ఏర్పాటు చేయడం, గ్రామాలలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. యాసంగిలో లక్ష ఎకరాల సాగుకు ప్రణాళికలు తయారు చేయనున్నట్లు వెల్లడించారు. 500 గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఏఈవో రోజు వారి షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. జిల్లాలో 1.17 లక్షల మందికి రైతుబంధు పథకం వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్న ఐదుగురు ఏఈవోలకు జనవరి 26న అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ శ్రీనివాస రావు, డీఆర్డీవో రవికృష్ణ, ఏపీడీ రామకృష్ణ, హార్టికల్చర్,వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
రక్తహీనత నిర్మూలనకు చర్యలు
రక్తహీనత నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే చిరుధాన్యాల పంటలకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. రైతు వేదిక భవనంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లకు ,వైద్య సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి చిరుధాన్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.