తాండూర్, జూలై 18 : పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తాండూర్ మండలంలోని చెరువులన్నీ నిండి జలకళ సంతరించుకున్నాయి. కొన్ని చెరువుల్లో మత్తడులపై నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఆయకట్టు కింద సాగయ్యే పంటలకు పుష్కలంగా సాగు నీరు అం దుతుందని, భూగర్భజలాలు పెర గడంతో బా వులు, బోరుబావులున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాండూర్ మండలంలోని కిష్టంపేట అన్నారం చెరువు, మేకలవాని చెరువు, చౌటపల్లి చౌటకుంట చెరువు, కొత్తపల్లి విలాసాగర్ చెరువు, నీలాయిపల్లి దాగాంవాని చెరువు, గంపలపల్లి పెద్దచెరువు, బోయపల్లి వెల్మలవాని చెరువు, కాసిపేట రంగసముద్రం చెరువు, ద్వారకాపూర్ రాముని చెరువు, గోపాల్నగర్ రాజుల చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. అచ్చలాపూర్, రేచిని, తాండూర్ పెద్దచెరువుల్లో ఆశించిన స్థాయిలో నీరు చేరుకుంది. మిషన్ కాకతీయ పథకంలో చేపట్టిన పూడికతీత పనులతో చెరువులన్నీ సర్వంగా సుందరంగా తయారయ్యాయి. జల వనరులు నిలువ సమర్థవంతంగా ఉండేలా పనులు కొనసాగి చెరువులన్నీ కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయ వల్ల చెరువులు పూడిక తీయడంతో నీటి నిలువ సామర్థ్యం పెరిగిందని, వానకాలం, యాసంగి పంటలకు సాగు నీటికి ఢోకా లేదని రైతులు సంతోషిస్తున్నారు.