బక్రీద్, వినాయకచవితిలను శాంతియుతంగా జరుపుకోవాలి..
ఇంటిముందు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి..
ఐజీ నాగిరెడ్డి.. బెటాలియన్ స్థల పరిశీలన
భైంసా, జూలై 15 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో మిర్జాపూర్ వద్ద ఉన్న సర్వే నంబర్ 162లో ప్రత్యేక బెటాలియన్కు హెడ్క్వార్టర్ పటాలం ఏర్పాటుకు ప్రభుత్వం పది ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీంతో గురువారం ఐజీ నాగిరెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భైంసాలో అల్లర్లు చోటుచేసుకోవడంతో శాంతి భద్రతల సమస్య నెలకొంటుందన్నారు. దీంతో బలగాలను రప్పించాల్సి వచ్చేదని తెలిపారు. శాశ్వతంగా శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏవైనా సంఘటనలు జరిగితే క్షణాల్లో పోలీసు బలగాలు చేరుకుంటాయని తెలిపారు. ఇప్పటికే జరిగిన అల్లర్లలో 33 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ‘నేను సైతం’లో భాగంగా పట్టణంలో 400 మంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రానున్న బక్రీద్, వినాయకచవితి పండుగలను ప్రజలందరూ అన్నదమ్ముళ్లుగా మెలిగి శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు. ఈయన వెంట ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖారే, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్బీ సీఐ రమేశ్, ముథోల్ సీఐ అజయ్, ఎస్ఐలు, తదితరులు ఉన్నారు.