కాసులకు ఆశ పడుతున్న బీజేపీ
ఎంపీ బాపురావ్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జోగు రామన్న
ఎఫ్సీఐ నామ్స్ ప్రకారమే కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఢిల్లీలో ఆందోళన చేస్తామని హెచ్చరిక
ఎదులాపురం, నవంబర్ 14: ధాన్యం కొనుగోలు విషయంలో ఎంపీ సోయం బాపురావ్ సోయిలేకుండా మాట్లాడుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) నామ్స్ ప్రకారం బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. తెలంగాణలోని రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్పై ఉందన్నారు. ఒక పక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో పక్క ఎంపీ సోయం బాపురావ్ ధాన్యం కొనుగోలు విషయంలో తలో మాట మాట్లాడుతున్నారన్నారు. ఇద్దరూ అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎఫ్సీఐ గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. మన రాష్ట్రంలో ఉప్పుడు బియ్యం యాసంగిలో పండిస్తామన్నారు. ఎఫ్సీఐ కమిటీ ప్రకారం ఏ ఏ రాష్ట్రం ఎంత బియ్యం పండించాలో అన్ని రాష్ర్టాల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. మార్చి 9, 2021 నాడు కేంద్ర మంత్రి నరేంద్రతోమర్ ప్రకటన చేసిన విషయాన్ని అప్పుడే మరిపోయారా? అని ప్రశ్నించారు. వరికి బదులు ఇతర పంటలు వేయాలని ఆనాడు కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి దేశంలో రైతుల నడ్డి విరిచింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.
కార్పొరేట్ పెద్దలకు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వం.. రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, రైతుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కాసుల కోసం ఆశ పడుతున్నది బీజేపీనేనని ఆరోపించారు. వ్యవసాయ రంగం, ఆహార ధాన్యాలపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి, ఎంపీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు ఎంఎస్పీ ప్రస్తావన లేదని, స్వామినాథన్ కమిటీ సిపార్సును అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదన్నారు. రైతులకు కరంట్ బిల్లు విషయంలో సబ్బిడీ చెల్లించాలని బీజేపీ ప్రభుత్వం కోరడం సరికాదని పేర్కొన్నారు. మోటర్లకు విద్యుత్ మీటర్లను బిగించుకుంటే రైతులు ఉరేసుకొని చావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా వాటిని తీసివేసింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు.
రైతు వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ అన్నారు. భారత రాజ్యాంగం 246 ఆర్టికల్ ప్రకారం ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనుగొళ్లను కేంద్ర ప్రభుత్వమే చేయాల్సిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారత రాజ్యాంగం చదవాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యమంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం కొనుగోలు చేసే వరకు రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందన్నారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు నల్ల రాజేశ్వర్, నారాయణ, రాజేశ్వర్ పాల్గొన్నారు.