శ్రీరాంపూర్, నవంబర్ 12 : శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 గనిలో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, యాజమాన్యం సీరియస్గా తీసుకున్నది. ప్రాథమిక విచారణలో బాధ్యులుగా గుర్తించి డిప్యూటీ మేనేజర్(ప్యానల్ ఇన్చార్జి)తో సహా సంబంధిత షిఫ్ట్ ఓవర్మన్, మైనింగ్ సర్దార్ల(సూపర్వైజర్లు)ను శుక్రవారం సస్పెన్షన్ చేసింది. గని మేనేజర్కు చార్జిషీట్ జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కాగా, మృతుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి వారంలోగా ఉద్యోగం కల్పించనున్నట్లు పేర్కొంది.
శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ 3, 3ఏ గనిలో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన ఘటనను యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ప్రాథమిక విచారణలో బాధ్యులుగా గుర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరిలో ఒకరు డిప్యూటీ మేనేజర్(ప్యానల్ ఇన్చార్జి)తోసహా సంబంధిత షిఫ్ట్ ఓవర్మెన్, మైనింగ్ సర్దార్ల(సూపర్వైజర్లు)ను సస్పెండ్ చేయడంతో పాటు గని మేనేజర్కు చార్జీషీట్ జారీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణపై అలసత్వంతో వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ తక్షణ విచారణకు ఆదేశించారు. డైరెక్టర్ (పర్సనల్, పీపీ, పైనాన్స్) ఎన్ బలరాంను తక్షణమే గనికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపి, నివేదించాలని ఆదేశించారు. దీంతో అధికారిక పర్యటనలో ముంబాయిలో ఉన్న బలరాం హుటాహుటిన వెనక్కి వచ్చి, గనిలో ప్రమాద స్థలాన్ని గురువారం పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై సమగ్ర విచారణ కొనసాగించే క్రమంలో ప్రాథమిక బాధ్యులుగా గుర్తించిన ముగ్గురిని తక్షణమే సస్పెండ్ చేయాలని మేనేజర్కు చార్జీషీట్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తి సాధించాలని తానూ పదేపదే సూచిస్తున్నానని, రక్షణ పెంపుదలకు పరిమితులు లేకుండా నిధులు కూడా మంజూరు చేస్నున్నామని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్ బలరాం కోరా రు. ఈ విషయంలో అధికారులు, కార్మికులు అనే తేడా లేకుం డా చర్యలూ కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. రక్షణపై మ రింత శ్రద్ధతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
వారంలోగా వారసులకు ఉద్యోగాలు
కార్మికుల మృతిపై యాజమాన్యం ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. గురువారం స్వయంగా స్వగ్రామాలకు వెళ్లి కంపెనీ పరంగా అందాల్సిన ఎక్స్గ్రేషియాను వారికి అధికారులు అందజేశారు. మిగిలిన మ్యాచింగ్ గ్రాంట్, ఇతర ప్రయోజనాలను వీలైనంత త్వరగా ఆందజేయడానికి యాజమాన్యం సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. గని ప్రమాద మృతుల కుటుంబసభ్యుల్లో ఆర్హులైన ఒకరికి వారం రోజుల్లోగా ఉద్యోగం కల్పించనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ (పర్సనల్) బలరాం శుక్రవారం మాట్లాడుతూ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. వారంలోగా ఉద్యోగ నియామక పత్రాలు అందించడమే కాకుండా వారు కోరుకున్న ఏరియాలో పోస్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.