రూ. 12 కోట్లతో వివిధ పనులకు ప్రణాళికలు
డీఎంఎఫ్టీ ద్వారా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
విద్యుత్ సమస్యల పరిష్కారానికీ చర్యలు
పట్టణాన్ని సుందరీకరిస్తాం : ఎమ్మెల్యే సక్కు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): జిల్లాకేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. డీఎంఎఫ్టీ నిధులు రూ. 12 కోట్లతో శాశ్వతంగా విద్యుత్, రోడ్లు, డ్రైనేజీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆసిఫాబాద్లో కోటి రూపాయలతో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. మిగితా రూ. 11 కోట్లతో రోడ్డు డివైడర్లు, పట్ట ణ సుందరీకరణ పనులతోపాటు, అవసరమైన వాడ ల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లను నిర్మించనున్నారు. అదేవిధంగా పారిశుధ్యానికి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాకేంద్రంలో గతంలో నిధుల లేమితో నిలిచిపోయిన వివి ధ సంఘాల కమ్యూనిటీ హాళ్లను పూర్తిచేయనున్నారు. రామ మందిరం వద్ద భక్తులకు సౌకర్యాలను కల్పించగడంతో పాటు ఛత్రపతి శివాజీ, కొండా లక్ష్మణ్ బాపూ జీ కమ్యూనిటీ హాళ్లను పూర్తిచేయనున్నారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలో కుమ్రం భీమ్ కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పిల్లల పార్క్లో పూర్తి సౌకర్యాలను కల్పించనున్నారు. రూ.12 కోట్ల డీఎంఎఫ్టీ నిధులతోపాటు సుమారు రూ. 60 లక్షలు గ్రామ పంచాయతీ నిధులతో జూబ్లీ మార్కెట్ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. వ్యాపారులకు మరుగుదొడ్లు ని ర్మించడంతోపాటు, పంచాయతీకి రెండు ట్రాక్టర్లు, 4 చెత్తను సేకరించే వాహనాలను సమకూర్చనున్నారు.
జిల్లా కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
జిల్లాకేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం డీఎంఎఫ్టీ నిధులు రూ. 12 కోట్లతో పనులు చేపట్టనున్నాం. శాశ్వతంగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి కోటి రూపాయలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, పట్టణ సుందరీకరణకు రూ. 11 కోట్ల నిధులు వెచ్చిస్తాం. రూ. 5 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. పంచాయతీ నిధులతో కూరగాయల మార్కెట్లో పూర్తి వసతులు కల్పిస్తాం. పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు పంచాయతీకి మరో రెండు ట్రాక్టర్లు, నాలుగు చెత్త సేకరించే వాహనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.