పీసీసీ అధ్యక్షుడికి చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సవాల్
సొంతింటి నిర్మాణానికి భూమిపూజ
రామకృష్ణాపూర్, ఆగస్టు 11 : ‘రేవంత్రెడ్డి.. దమ్ముంటే హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీచేయ్.. పీసీసీ పదవి వచ్చిందని విర్రవీగుతున్నవు.. నీవు చంద్రబాబు ఏజెంటువు.. అడవి బిడ్డలను పొట్టన బెట్టుకున్నది మీరు కాదా?’ అని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గల గద్దరాగడి సమీపంలో ఇంటి నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. దళితులకు, గిరిజనులకు కేసీఆర్ హయాంలోనే న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్రెడ్డి ఉద్యమం సమయంలో ఎక్కడు న్నాడని, దమ్ముంటే హుజూరాబాద్లో పోటీ చే యాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సవాల్ విసిరారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దరాగడి సమీపంలో తాను నిర్మించుకునే నూతన స్వగృహానికి బుధవారం భూమిపూజ చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు సొంతింటిని నిర్మించుకుంటున్నానని తెలిపారు. అనంతరం కార్యకర్తలతో పలు విషయాలపై చర్చించారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి సభలో నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడన్నారు.
తాము తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు చేసినప్పుడు రేవంత్రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేసేందుకు రేవంత్రెడ్డి బయలు దేరాడని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం కోసం తాము దెబ్బలు తిని జైలు పాలైతే చంద్రబాబుతో కలిసి రేవంత్ సమైక్యవాదం ఎత్తుకున్నాడని గుర్తుచేశారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ దళిత బిడ్డలను ఓట్లేసే యంత్రాలుగా చూసిందని, ఇంద్రవెల్లిలో గిరిజన బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ర్టానికి పట్టిన అరిష్టం, శని రేవంత్ అని ధ్వజమెత్తారు. దళితులకు, గిరిజనులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని, వారి సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రతిపక్ష పార్టీలకు మనుగడ లేకుండా చేస్తున్నాయనే అక్కసుతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విప్ ఆరోపించారు.
తమకు పుట్టగతులుండవనే కాంగ్రెస్ నాయకులు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారన్నారు. టీపీసీసీ పదవిని చేపట్టి విర్రవీగుతున్న రేవంత్రెడ్డి దమ్ముంటే హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు. ఓటుకునోటు దొంగ రేవంత్రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, యువకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్లు ప్రవీణ్కుమార్, జడ్పీటీసీ వేల్పుల రవి, మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, అబ్దుల్ అజీజ్, గంగారపు సత్యపాల్, కొండ కుమార్, లక్ష్మారెడ్డి, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.