రెచ్చగొట్టడమే బీజేపీ నాయకుల పని
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
మంచిర్యాల, మందమర్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
పాల్గొన్న ప్రభుత్వవిప్, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్
మంచిర్యాలటౌన్, నవంబర్ 8: జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. మంచిర్యాల, మందమర్రి పట్టణాల్లో సోమవారం ఆయన పర్యటించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ భారతీ హోళికేరి, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. రూ 48.69 లక్షలతో సఖీ భవనం, రూ. 7.20 కోట్లతో సమీకృత మార్కెట్ భవన సముదాయం, రూ. 8 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, రూ. 70 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో ప్రభుత్వ దవాఖానలో రెండు వార్డులు, రెండో అంతస్థు, విశ్వనాథాలయంలో రూ. 21 లక్షలతో మండపాన్ని ప్రారంభించారు. మంచిర్యాలలోని ఐబీ, ఐటీఐ ఆవరణలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ధాన్యాన్ని కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే గోదాముల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయని, రెండో పంటను కొనే పరిస్థితి లేదన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఇతర పంటలు వేసుకోవాలని విన్నవించారు. కేంద్రం ధాన్యం కొనబోమని చెబుతుంటే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు రాష్ట్రంపై నిందలు వేస్తూ రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంచిర్యాల పట్టణంలో రూ. 7.20 కోట్లు వెచ్చించి 104 మడిగెలతో అధునాతన సమీకృత మార్కెట్ను ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఐబీలో నిర్మిస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో వృత్తి శిక్షణ, నైపుణ్యతను పెంపొందించడం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా చూస్తామని చెప్పారు.
రైతుల జోలికి వస్తే ఊరుకోం..: ఎంపీ
కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ రైతుల జోలికి వస్తే ఊరుకోబోమని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని అన్నారు. కేంద్రం వైఖరితో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గందరగోళాన్ని సృష్టించి పబ్బం గడుపుకోవాలని ఆ పార్టీ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టంలో రైతాంగాన్ని ఆదుకోవాలని చూస్తుంటే, బీజేపీ నాయకులు అడ్డుపుల్లలు వేస్తూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఇసుక కొరత ఏర్పడిందని, దీంతో నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజలందరికీ మేలు జరిగేలా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్ని వేళలా అండగా నిలబడాలని కోరారు. కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ అధునాతన, శాస్త్రీయ పద్ధతులతో మంచిర్యాలలో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతున్నామని, వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అధికారులు, పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గురువయ్య, మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీల చైర్మన్లు పెంట రాజయ్య, ప్రభాకర్, నల్మాసు కాంతయ్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వసుంధర, వైస్చైర్మన్ ముఖేశ్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, నాయకులు నడిపెల్లి విజిత్రావు, అత్తి సరోజ, పల్లపు తిరుపతి, మురళి, రవీందర్రెడ్డి, రాకేశ్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, డీఎంహెచ్వో కుమ్రం బాలు, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ అరవింద్, ఐసీడీఎస్ డీడబ్ల్యూవో ఉమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీజేపీ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలి : మంత్రి
మందమర్రి, నవంబర్ 8 : బీజేపీ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పిలుపునిచ్చారు. మందమర్రి మున్సిపాలిటీలో రూ. 22.90 కోట్లతో నిర్మిస్తున్న ఆర్వోబీ, రూ.7.20 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణం పనులు సోమవారం భూమి చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులకు దమ్ముంటే కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తేవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో మందమర్రి మున్సిపాలిటీ సమీపంలోని 600 ఎకరాల అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కును ఏర్పాటు చేస్తామని, రూ. ఐదు కోట్లు మంజూరు చేయాలని మంత్రిని విప్ కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం ప్రాణహిత కాలనీ సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్ కుమార్, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, జడ్పీ సీఈవో నరేందర్, మందమర్రి కమిషనర్ గద్దె రాజు పాల్గొన్నారు.