రూ.79.39 కోట్లతో అభివృద్ధి పనులు
ఇప్పటికే కొనసాగుతున్న నిర్మాణాలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
హరితహారం కార్యక్రమం ప్రారంభం
దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ..
చెన్నూర్, జూలై 4 : చెన్నూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. పట్టణంలోని 3వ, 17వ, 18వ వార్డుల్లో ఆదివారం మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి ఆయన హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ సుమన్ మాట్లాడారు. చెన్నూర్ పట్టణంలో రూ.79.39 కోట్లతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 70 ఏండ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎవరూ తీసుకురాలేదన్నారు.
ఇప్పటికే జలాల్ పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రధాన రహదారి విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్, సైడ్డ్రైన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే పెద్ద చెరువు, కుమ్మరి కుంట మినీ ట్యాంక్ బండ్ పనులు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, అంబేద్కర్ స్టడీ సెంటర్, అర్బన్ పార్కు పనులు కూడా సాగుతున్నాయని వివరించారు. కరోనా కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగిందని, త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. పట్టణ ప్రజలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు పట్టణంలో నాలుగు ఫంక్షన్ హాళ్లు, అలాగే వెజిటేబుల్, నాన్ వెజిటేరియన్ కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించనున్నట్టు వెల్లడించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిపల్ చైర్పర్చన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కమిషనర్ ఖాజా మోయిజొద్దీన్, కౌన్సిలర్లు వేల్పుల సుధాకర్, నాయిని శ్యామల, గర్రెపల్లి శాంతారాణి, రేవెల్లి మహేశ్, తుమ్మ రమేశ్, కమ్మల శ్రీనివాస్, జగన్నాథుల శ్రీను, దోమకొండ అనిల్, కో ఆప్షన్ సభ్యులు కొండపర్తి లక్ష్మి, అయూబ్ఖాన్, కేవీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
50 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ..
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్తో కలిసి విప్ సుమన్ 50 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా అన్ని రకాలుగా ఆదుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.