అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి
ఇందిరానగర్ జీపీలో పర్యటన
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం..
కొమ్ముగూడ, ఈదులవాడల్లో అరిగెల, గంగాపూర్లో డీపీవో పర్యటన..
రెబ్బెన, జూలై 4 : పల్లె ప్రగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయవద్దని అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. మండలంలోని ఇందిరానగర్ జీపీలో ఆదివారం ఆయన పర్యటించారు. పల్లెప్రగతి పనులను పరిశీలించారు. వార్డుల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు. పారిశుధ్య లోపం జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను డంప్ యార్డుకు తరలించి ఎరువు తయారుచేయాలని సూచించారు. ప్రకృతి వనంలో మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలన్నారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సర్పంచ్ దుర్గం రాజ్యలక్ష్మి, కార్యదర్శి నమ్రతను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణసింగ్, సర్పంచ్ రాజ్యలక్ష్మి, కార్యదర్శి నమ్రత, అంగన్వాడీ టీచర్ తిరుపతమ్మ, అశ కార్యకర్త అనిత, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
గంగాపూర్లో డీపీవో పర్యటన..
రెబ్బెన మండలంలోని గంగాపూర్ పంచాయతీలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ పర్యటించారు. అభివృద్ధి పనులను పరిశీలించి, వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గంగాపూర్ శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు గణేశ్శర్మ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పందిర్ల వినోద, ఉప సర్పంచ్ అదే సతీశ్, మండల ప్రత్యేకాధికారి రబ్బానీ, ఎంపీవో అంజద్పాషా, కార్యదర్శి వంశీకృష్ణ, వార్డు సభ్యులు వినోద్కుమార్, సత్తమ్మ, వీవో లీడర్ తానుబాయితో పాటు పలువురు పాల్గొన్నారు.
మాదవాయిగూడలో ఎంపీపీ..
పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి మాదవాయిగూడ జీపీలో రెబ్బెన ఎంపీపీ జుమ్మిడి సౌందర్య పాల్గొన్నారు. గ్రామస్తులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. ఎంపీడీవో సత్యనారాయణసింగ్, సర్పంచ్ దోబే పార్వతి, వార్డు సభ్యులు, కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
కొమ్ముగూడ, ఈదులవాడల్లో అరిగెల..
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూలై 4 : మండలంలోని కొమ్ముగూడ, ఈదులవాడ గ్రామాల్లో ఎంపీపీ మల్లికార్జున్తో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల వంట గది నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలునాటి, గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. ఈదులవాడ అభివృద్ధి కోసం జడ్పీ నిధులు రూ.10 మంజూరయ్యాయని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ బూషి భీమేశ్, నాయకులు సురేశ్, శ్రీశైలం, సత్యనారాయణ, సోమేశ్వర్ తదితరులు ఉన్నారు.
కాగజ్నగర్ రూరల్, జూలై 4 : పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని 23వ వార్డులో కిరాణా దుకాణాలు, ఇంటి యజమానులకు ప్లాస్టిక్ మున్సిపల్ సిబ్బంది అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ విద్యావతి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కౌటాల, జూలై 4 : మండల కేంద్రంతో పాటు తలోడి గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ పరిశీలించారు. పారిశుధ్య పనుల వివరాలు అడిగి తెలుసుకొని, తగు సూచనలు చేశారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి రవీందర్, ఎంపీడీవో నస్రూల్లాఖాన్ తదితరులున్నారు.
కౌటాల రూరల్, జూలై 4 : పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మొగఢ్దగఢ్ గ్రామంలో మండల ప్రత్యేకాధికారి రవీందర్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యనూ పరిష్కరించాలన్నారు.
జైనూర్, జూలై 4 : మండలంలోని జామ్ని గ్రామంలో ఐటీడీఏ డీడీ మణియమ్మ హరితహారం మొక్కలు నాటారు. అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాహుల్, నాయకులు సమాదాన్, అంగన్వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్త, గ్రామస్తులు పాల్గొన్నారు.