కేంద్రంలోని మోదీ సర్కారు ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునఃప్రారంభంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. అన్ని వసతులు ఉన్నా.. రా్రష్ట్ర సర్కారు తరఫున ముఖ్యమంత్రి, మంత్రులు కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా ప్రారంభంపై నోరు మెదపడం లేదు. పైగా యంత్ర సామగ్రిని వేలానికి పెట్టి, అమ్మాలని చూస్తున్నది. తాజాగా ప్రకటించిన బడ్జెట్లో కూడా సీసీఐ ప్రస్తావన లేకపోవడంపై ఆదిలాబాద్ జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారు యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ను ఏర్పాటు చేయడానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఫలితంగా 1000 మందికి ఉపాధి లభించనుంది. ఒకవైపు రాష్ట్ర సర్కారు యువతకు ఉద్యోగాలు కల్పించాలని చూస్తుంటే.. దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చి హామీని విస్మరించిన బీజేపీ సర్కారు తీరుపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ)
మోదీ మోసం..
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ).. 1984 సంవత్సరంలో రూ.47 కోట్లతో నిర్మించారు. 772 ఎకరాల భూమి, 400 క్వార్టర్లు, 170 ఎకరాల టౌన్షిప్ ఉంది. ఎన్హెచ్-44కు ఆనుకొని ఉండడం, 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలు, నీటి వనరులు, కరంటు అందుబాటులో ఉన్నాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం నష్టాల సాకుతో 2008 సంవత్సరంలో పరిశ్రమను మూసివేసింది. ప్రస్తుతం కేంద్రానికి రాష్ట్ర సర్కారు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రారంభించడం లేదు. ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు వేల మందికి ఉపాధి లభించనున్నది.
కేసీఆర్ ఉపాధి..
ఐటీ టవర్ నమూనా.. మారుమూల జిల్లా అయిన ఆదిలాబాద్ పట్టణ శివారులోని మావలలో తెలంగాణ సర్కారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే మూడెకరాల స్థలం కూడా కేటాయించింది. రూ.40 కోట్లు కూడా మంజూరు చేసింది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించనుండగా.. మల్టీ నేషనల్, స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఐటీ టవర్ వల్ల 1000 మందికి భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభించనున్నాయి.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోదీ సర్కారు ఎన్నికల్లో భాగంగా దేశంలో 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన వాగ్ధానం నేరవేరలేదు. దీంతో ఉన్నత విద్య చదువుకున్న యువత కేంద్రం వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగాలు, కార్మికుల ఉపాధిని కొల్లగొడుతున్నది. గతంలో మూతబడిన పరిశ్రమలను పునఃప్రారంభించి లాభాల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నా పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్ సిమెంటు కంపెనీ విషయంలో కేంద్రం వైఖరి ఇలాగే ఉంది. ప్రస్తుతం దేశంలో సిమెంటుకు మంచి డిమాండ్ ఉంది. ప్రైవేటు సిమెంటు పరిశ్రమలు లాభాలబాటలో నడుస్తున్నాయి.
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునః ప్రారంభించడానికి అన్ని వసతులు ఉన్నా కేంద్రం కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నది. జాతీయ రహదారి-44కు పైన సీసీఐ ఉండగా పరిశ్రమ తిరిగి ప్రారంభమైతే ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుంది. సిమెంటు తయారీకి అవసరమైన ముడిసరుకు పుష్కలంగా ఉంది. 772 ఎకరాల భూమి, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలు ఉన్నాయి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్తోపాటు నీటి వనరులు ఉన్నాయి. అన్నీ వనరులున్న సీసీఐని పునఃప్రారంభించే విషయంలో మోడీ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సీసీఐ ప్రస్తావన లేకపోవడంపై ఆదిలాబాద్ జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విజ్ఞప్తులకు స్పందన కరువు
సీసీఐని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తులు పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి మోదీని కలిసి సీసీఐని పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ గతంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అనంత్గితేను కలిసి సీసీఐ ప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు. సీసీఐని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెబితే తాము ప్రారంభిస్తామని సూచించారు. పరిశ్రమ పునఃప్రారంభానికి రాయితీలు కల్పిస్తామని విన్నవించారు. పలుమార్లు మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి వినతిపత్రాలు అందజేసినా.. మోదీ ప్రభుత్వంలో చలనం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులు, వేలాది మంది ఉపాధిని పట్టించుకోకుండా స్థానిక ప్రజల కోరికను ఏ మాత్రం లెక్క చేయకుండా కేంద్రం ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను అమ్మాలని చర్యలు చేపట్టింది. యంత్ర సామగ్రి వేలం తర్వాత సిమెంటు పరిశ్రమకు సంబంధించిన విలువైన భూములు, భవనాల అమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుందని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.
రూ.40 కోట్లతో ఐటీ టవర్.. 1000 మందికి ఉపాధి..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల ఉపాధిని కొల్లగొడుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లావాసులకు అండగా నిలుస్తున్నది. ఏడాది క్రితం ఆదిలాబాద్లో బీడీఎన్టీ ఐటీ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ప్రారంభం కాగా.. 130 మంది జిల్లావాసులు ఉద్యోగం చేస్తున్నారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించడంలో భాగంగా ప్రభుత్వం ఆదిలాబాద్లో ఐటీ టవర్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం మూడెకరాల స్థలం సేకరించి రూ.40 కోట్లు మంజూరు చేసింది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభంకానుండగా ఇందులో మల్టీ నేషనల్, స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న ఐటీ టవర్ వల్ల 1000 మందికి భారీ వేతనాలతో కూడిన ఉపాధి లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అదానీకి కట్టబెట్టే ప్రయత్నం..
ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వం పేదల ఉపాధిని కొల్లగొడుతున్నది. వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నా ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను అదానీ సంస్థలకు అప్పగించే ప్రయ త్నాలు చేస్తున్నది. సీసీఐని తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆరు నెలలపాటు భారీ ఆందోళన చేపట్టాం. మోదీ ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు. బీజేపీ ప్రభుత్వం చర్యలను సాధన కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకుంటాం.
– విజ్జగిరి నారాయణ, సీసీఐ సాధన కమిటీ కో-కన్వీనర్.
రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధికి పెద్దపీట..
కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను కొల్లగొడుతుం డగా.. తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నది. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు ప్రైవేటు పరిశ్రమల ద్వారా యువకులు ఉద్యోగాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నది. ఆదిలాబా ద్లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్ ద్వారా 1000 మందికి పైగా యువతకు మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. జిల్లా కేంద్రంలో ఉన్న ఐటీ కంపెనీలో 130 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కేంద్ర వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
– శివకుమార్, యువకుడు, ఆదిలాబాద్.