కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ సర్కారు నీలి విప్లవానికి శ్రీకారం చుట్టగా, అధికారుల నిర్లక్ష్యంతో.. ఆ లక్ష్యం నీరుగారిపోతున్నది. వ్యాపారుల ప్రమేయాన్ని నియంత్రించాల్సిన మత్స్యశాఖ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండగా, సొసైటీ సభ్యులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నది. మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు నీలి విప్లవానికి శ్రీకారం చుట్టింది.
ఈ మేరకు జిల్లాలోని నాలుగు ప్రధాన జలాశయాలు పీపీరావ్ ప్రాజెక్టు, ఎన్టీఆర్సాగర్, వట్టివాగు, కుమ్రం భీం ప్రాజెక్టుతో పాటు దాదాపు 250 నీటి వనరుల్లో కోటీ 38 లక్షల చేప పిల్లలను విడుదల చేసింది. 5 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 60 మత్స్య సహకార సంఘాలుండగా, వీటిలో 5 వేల మంది సభ్యులున్నారు. అలాగే అనేక గిరిజన కుటుంబాలు కూడా చేపల వేటపై ఆధారపడి ఉన్నాయి. ఆయా సంఘాలు స్వయం ఉపాధి పొందేలా చేపల పంపకాన్ని వాటికే అప్పగించింది. చేపల విక్రయానికి మార్కెటింగ్ సౌకర్యంతో పాటు మత్స్యకారులకు వాహనాలను కూడా సమకూర్చింది.
ప్రస్తుతం జలాశయాల్లో చేపల వేట కొనసాగుతుండగా, దళారులు కన్నేశారు. గ్రామీణ ప్రాంతాల మత్స్యకారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దళారులు సొమ్ముచేసుకుంటున్నారు. మహారాష్ట్ర, హైదరాబాద్వంటి ప్రాంతాల నుంచి వస్తున్న దళారులు నేరుగా ఇక్కడి మత్స్య సంఘాలతో ఒప్పందాలు చేసుకొంటున్నారు. చెరువులను స్వాధీనం చేసుకొని కాపలాదారులను పెట్టుకుంటున్నారు.
చేపల రకాన్ని బట్టి కిలోకు రూ. 100 నుంచి రూ. 160 దాకా పెట్టి చెరువుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. ఆపై పట్టణ ప్రాంతాలకు తరలించి కిలోకు రూ. 300 చొప్పున విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. మత్స్యకారులు నేరుగా చేపలు పట్టుకొని అమ్ముకునేలా గత సర్కారు అన్ని సౌకర్యాలు కల్పించింది. దళారుల ప్రమేయాన్ని నియంత్రించాల్సిన మత్స్యశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో మత్స్యకారులు అన్ని విధాలా నష్టపోవాల్సి వస్తున్నది.