కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : నీట్లో మంచి మార్కులు సాధించి దాతల సాయంతో ఎంబీబీఎస్లో చేరిన నిరుపేద విద్యార్థిని కరిష్మాకు.. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం వైద్య విద్య కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారగా, దిక్కుతోచక సతమతమవుతున్నది. దయామయులెవరైనా ఆదుకోకపోతారా అని ఆశతో ఎదురుచూస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన చహారే రేఖ-జనార్దన్ దంపతులది నిరుపేద కుటుంబం. 2019లో జనార్దన్ గుండె సంబంధిత వ్యాధితో మంచం పట్టాడు. రేఖ కూలీనాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నది. రూ. 4 లక్షల వరకు అప్పు చేసి భర్తకు ఆపరేషన్ కూడా చేయించింది.
వీరి మూడో కూతురు కరిష్మా 2021లో నీట్ రాయగా, 417 మార్కులతో 1,11,479 ర్యాంకు సాధించింది. ప్రభుత్వ కోటాలో ఫిబ్రవరి 5(2022)న హైదరాబాద్లోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్-రీసెర్చ్లో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. దాతల సాయం(రూ.3.50 లక్షలు)తో ఎంబీబీఎస్లో చేరి చదువు కొనసాగిస్తున్నది. ప్రస్తుతం మళ్లీ ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఎంబీబీఎస్ పూర్తి కావాలంటే హాస్టల్ ఫీజులతో కలుపుకొని దాదాపు రూ.15 లక్షల దాకా చెల్లించాల్సి ఉంది.
ప్రస్తుతం సెమిష్టర్ ఫీజుకోసం రూ. 2.42 లక్షలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం చెప్పగా, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. కుటుంబం గడవడమే కష్టంగా ఉండగా, అంత డబ్బు కట్టేది ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. డాక్టర్ కావాలన్న ఆమె ఆశకు పేదరికం అడ్డురావడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తుంది. ఎస్బీఐ అకౌంట్ నంబర్-40833814222 (ఐఎఫ్సీ కోడ్ ఎస్బీఐఎన్0061739), ఫోన్ పే-గూగుల్ పే నంబర్-9381829476కు సాయం పంపించాలని వేడుకుంటున్నది.