కంటిచూపు మందగించి.. కన్నబిడ్డలు పట్టించుకోక.. తమ పనులు చేసుకోలేక అవస్థలు పడుతున్న వృద్ధుల పాలిట ‘కంటి వెలుగు’ వరంగా మారింది. డిజిటల్ యుగంలో చిన్నప్పటి నుంచే మొబైల్స్, టీవీలు, ల్యాప్టాప్లు చూసి దృష్టిలోపంతో బాధపడుతున్న పిల్లలు, యువత జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సీఎం కేసీఆర్ బీజం వేశారు. దత్తత గ్రామమైన ఎర్రవెల్లిలో నిర్వహించిన వైద్యశిబిరంలో వృద్ధులు, చిన్నారులు తమకు కంటి సమస్య ఉందని తెలుసుకోలేని స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఎంత మంది కంటి సమస్యతో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టిన కంటి వెలుగు మొదటి విడుతలో లక్షలాది మంది దృష్టి లోపాలను సరిదిద్దింది. నాలుగేండ్ల క్రితం నిర్వహించిన మొదటి విడుతలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించి, శస్త్రచికిత్సలు చేశారు. నేటి నుంచి రెండో విడుత నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనేపథ్యంలో తొలి విడుత కంటి వెలుగులో లబ్ధిపొందిన వారిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. ఆ అభిప్రాయాలు..
తెలంగాణ ప్రభుత్వం 2018లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మొదటి విడుత ‘కంటి వెలుగు’ వృద్ధులు, కంటి చూపు మసకబారిన బాధితుల జీవితాల్లో నూతన వెలుగులు నింపింది. అప్పట్లో శిబిరాల్లో చికిత్స పొందిన వేలాది మందికి కంటి చూపు చక్కగా ఉండడంతో సంబురపడుతున్నారు. కేసీఆర్ను వెయినోళ్ల పొగుడుతున్నారు. కేసీఆర్ సారే.. తమ కండ్లకు వెలుగయ్యాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి విడుతలో 14.68 లక్షల మందిని పరీక్షించి, అవసరమైన వారికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుతకు సిద్ధమైంది. నేటి(బుధవారం) నుంచి వంద రోజుల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19.28 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా.. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్, వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించుకోవడానికి జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం 08732-295062 ఏర్పాటు చేశారు. కంటి వెలుగు నిర్వహణలో భాగంగా అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ఈనేపథ్యంలో తొలి విడుత కంటి వెలుగులో లబ్ధిపొందిన వారిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. ఆ అభిప్రాయాలు..
– ఆదిలాబాద్/నిర్మల్, జనవరి 17(నమస్తే తెలంగాణ)
కోటపల్లి, జనవరి17 : తెలంగాణ సర్కారోళ్లు ‘కంటి వెలుగు’తో నా జీవితంలో వెలుగులు నింపిండ్రు. నేను వృత్తి రీత్యా క్షౌరకుడిని. వయసు 48 ఏండ్ల దాకా ఉంటది. కండ్లు సరిగ్గా కనిపించేవి కావు. మంచిర్యాలకు పోయి కండ్ల పరీక్షలు చేసుకుందామంటే డబ్బులకు ఇబ్బంది అయ్యేది. చూపించుకోక పోవడంతో కంటి సమస్య పెరిగింది. కండ్లు కనబడనిస్థితికి వచ్చింది. ప్రభుత్వం 2018లో కంటి వెలుగు కార్యక్రమం పెట్టింది. మా ఊళ్లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు మందులు, అద్దాలిచ్చిండ్రు. అప్పటి నుంచి కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్. ఎలాంటి ఇబ్బంది పడకుండా పని చేసుకుంటున్న. లేకపోతే నా వృత్తికి దూరమై బతకడానికి కష్టంగా ఉండేది. నా వంటి పేదలకు సర్కారు చాలా మేలు చేసింది. గిప్పుడు గూడా మరోసారి పరీక్షలు చేయించుకుంట.
– పోతురాజుల మధూకర్, కోటపల్లి మండలం.
సీఎం కేసీఆర్ వల్లే ఇప్పుడు నా కంటి సమస్యలు దూరమయ్యాయి. పోయినసారి కంటి వెలుగు శిబిరంలనే పరీక్షలు చేయించు కున్న. అప్పుడే కళ్లద్దాలు,మందులు ఉచితంగా ఇచ్చిన్రు. దవాఖానకు పోతే మస్తు పైసలైతుండే. అద్దాలకే రెండు వేల దాకా గుంజేటోళ్లు. గతంలో నాకు కళ్లు మంచిగ కనిపించకపోయేటివి. సీఎం కేసీఆర్ సారు పుణ్యాన ఈ శిబిరాలు వచ్చినయ్. అక్కడే నేను కూడా అద్దాలు తీసుకున్న. ఇవే కంటికి వెలుగు ప్రసాదించినయ్. ఇప్పుడు చక్కగా చూడగలుగుతున్న. మసకమసక అంతా పోయింది. ఈసారి కూడా శిబిరాలు పెట్టి కంటి పరీక్షలు చేస్తరని అంటున్నరు. చాలా మందికి ఉపయోగపడుతది.
-దుర్గం సత్యశీల, సులుగుపల్లి
గతంలో కంటి వెలుగుల ఇచ్చిన అద్దాలనే ఇప్పటికీ వాడుతున్న. వయసు పెరిగిన కొద్దీ చూపు మందగిస్తున్నది. కంటివెలుగు కార్యక్రమం మళ్లీ మాకు చూపును అందించింది. సీఎం కేసీఆర్ పేదలకు మంచి చేసే పనులే చేస్తడు. ఫ్రీగా కంటి పరీక్షలు చేయించిన నాయకుడు గతంలో ఏ ఒక్కరూ లేరు. దవాఖానకు పోవాలంటే దూర ప్రాంతానికి పోవాలే. పరీక్షలు, కళ్లద్దాలకు డబ్బులు ఒడిసేటియ్. మా ఊర్లనే క్యాంపు పెట్టి సర్కారోళ్లు పరీక్షలు చేయించిన్రు. ఇక్కడే టెస్టు చేయించుకున్న. పెద్ద పెద్ద డాక్టర్లు ఈడికే వచ్చి పరీక్షలు చేసి, మందులు, అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు ఇబ్బంది లేకుండా చూస్తున్న.
– పేదం ధర్మయ్య, రంగాపూర్
నాకు కంటి చూపు కొద్దిగా తగ్గింది. చాలా ఇబ్బందయ్యేది. సీఎం కేసీఆర్ గతంలో పెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో టెస్టులు చేయించుకన్న. డాక్టర్లే మా దగ్గరికి వచ్చి పరీక్షలు చేసుడు మా అదృష్టం. అవసరమున్నోళ్లకు మందులు, అద్దాలు ఇచ్చిన్రు. నాకు కూడా కళ్లద్దాలు ఇచ్చిన్రు. అవి పెట్టుకున్నంక నా తిప్పల తప్పింది. అద్దాలకే ప్రైవేట్ల బాగ పైసలయ్యేటివి. ఇప్పుడు మళ్లీ టెస్టులు చేస్తమని సార్లు చెబుతున్నరు. మళ్లోసారి పరీక్షలు చేయించుకుంట. దవాఖానల కాడికి పోవుడు నాతోని కాదు. ఈడైతే ఫ్రీగా టెస్టులు చేసి, అవసరమైతే డాక్టర్లు మందులు ఇస్తరు.
– కొండపల్లి రంగుబాయి, బెజ్జూర్
సర్కారోళ్లు కంటి వెలుగు కార్యక్రమం చేస్తున్రు. ఇది మాలాంటి పేదలకు ఎంతో ఉప యోగపడుతుంది. పోయినసారి నేను కంటి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు మా ఊరికి వచ్చి మిషన్లతో అన్ని పరీక్ష లు చేసిన్రు. నజర్ తక్కువగా ఉందని అద్దాలిచ్చిన్రు. ఐదేండ్ల సంది గా అద్దాలే వాడుతున్నా. అద్దాలు పెట్టుకున్నప్పటి నుంచి సూపు మంచిగైంది. మళ్లోసారి మా ఊరికి డాక్టర్లు వస్తున్నరని పంచాయతీ వాళ్లు చెప్పిన్రు. ఈసారి కూడా పరీక్షలు చేయించుకుంట. రూపాయి తీసుకోకుండా గింత మంచి పని చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం.
– కేమ లక్ష్మి, గృహిణి, వాన్వట్, ఆదిలాబాద్ రూరల్ మండలం
ఐదేండ్లకింద మా ఊర్లో మిషన్లతో కంటి పరీక్ష లు చేసిన్రు. నేను కూడా సూపించుకున్న. సూపు సరిగా లేదని అద్దాలు ఇచ్చిన్రు. మందులు కూడా ఇచ్చిన్రు. మాలాంటో ళ్లకు సీఎం కేసీఆర్ కండ్ల పరీక్షలు చేసి సూపు వచ్చేటట్లు చేస్తున్నడు. కండ్లు సక్కగా కనపడక ముసలోళ్లు మస్తు తిప్పలపడుతున్రు. పైసలు లేక దవాఖాన్లకు పోనోళ్లు మస్తు మందే ఉన్నరు. గిప్పుడు మళ్లోసారి కంటి పరీక్షలు చేస్తే ఇగ అందరికీ మేలు చేసినట్లయితది.
– కేమ లసిందేవి, వాన్వట్. ఆదిలాబాద్ రూరల్ మండలం
ఈమె పేరు సాయమ్మ. ఊరు ఖానాపూర్ మండలం గోసంపల్లె. వయసు 75 ఏళ్లు. భర్త సాయన్న పదేళ్లక్రితమే చనిపోయిండు. ఈమెకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉంది. అందరి పెళ్లిల్లు చేసింది. పెద్ద కొడుకు లచ్చన్న దివ్యాంగుడు. పళ్లైన కొద్ది రోజులకే ఇతడి భార్య పుట్టింటికి వెళ్లి పోయింది. అప్పటి నుంచి కొడుకు, మనుమరాలితో కలిసి ఉంటుంది. ఈమెతో పాటు దివ్యాంగుడైన లచ్చన్నకూ సర్కారు ఇచ్చే పింఛన్ అందుతుంది. సాయమ్మకు కంటిచూపు తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న సాయమ్మకు 2018లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘కంటివెలుగు’ వరం అయింది. అప్పట్లో ఈమెను పరీక్షించిన వైద్యులు రెండు కండ్లకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ముథోల్లోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో ముందుగా ఒక కన్నుకు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత మరో కన్నుకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం సాయమ్మ తన పనులు తాను చేసుకోవడంతో పాటు కొడుకు, మనుమరాలికి వంట చేసి పెడుతుంది. నయా పైసా ఖర్చు లేకుండా రెండు కండ్లకు ఆపరేషన్ చేయించిన దేవుడు సీఎం కేసీఆర్ అని కొలుస్తున్నది.
– టేకు సాయమ్మ, గోసంపల్లె, ఖానాపూర్ మండలం
దండేపల్లి, జనవరి17 : నాకు 70 ఏండ్ల దాకా ఉంటయ్. కండ్లు సరిగా కనబడకపోయేవి. ప్రైవేట్ దవాఖాన్ల సూపించుకుందామంటే పైసలుండేటివి కావు. కంటి జబ్బుతో చాలా యేండ్లు బాధపడ్డా. ఐదేండ్ల కింద మా ఊరి బడిలో క్యాంపు పెట్టిన్రు. ఆశ కార్యకర్త వచ్చి చెబితే పోయి డాక్టరుకు సూపించుకున్న. రూ.2 వేల విలువైన అద్దాలు ఉచితంగా ఇచ్చిన్రు. అదే ప్రైవేట్ దవాఖానకు పోతే వేలకు వేలు అయ్యేటివి. పైసా ఖర్సు లేకుండా సూపొచ్చింది. ఇప్పుడు కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్. లేకుంటే నా పరిస్థితి ఎట్లుండేదో ఏమో.. సీఎం కేసీఆర్ మాలాంటి పేదోళ్ల ఆరోగ్యం బాగుండాలని మస్తు మంచి పనులు చేస్తున్నడు. ఇది వరకున్న సర్కారోళ్లు గిట్ల ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. కేసీఆర్ సార్ ఉన్నంత కాలం పేదోళ్లకు రంది ఉండదు. ఇప్పుడు మళ్లా కంటి వెలుగు పథకం షురూ చేస్తున్నరట. మళ్లోసారి పోయి పరీక్షలు చేయించుకుంట.
– రాపెల్లి రాజయ్య, తాళ్లపేట
నాకు 62 ఏండ్లుంటయ్. కండ్లు సక్కగా కనిపించకపోయేవి. ఆదిలాబాద్కు పోయి ప్రైవేట్ దవాఖాన్ల చూపించుకునేటోన్ని. వాళ్లిచ్చిన మందులు వాడిన. అయినా మసకగానే కనిపించినయ్. సీఎం కేసీఆర్ సారు ‘కంటి వెలుగు’ పేరిట మా ఊరిలో వైద్య పరీక్షలు చేయించిండు. నేను కూడా పోయి చూపించుకున్న. డాక్టర్లు పైసా తీసుకోకుండా ఉచితంగా అద్దాలిచ్చిన్రు. అప్పటి నుంచి కండ్లు మస్తు మంచిగ కనిపిస్తున్నయ్. అన్ని పనులు నేనే చేసుకుంటున్న. మళ్లోసారి పరీక్షలు చేస్తరని ఊర్లో చెబుతున్రు. నేను కూడా చేయించుకుంట. మా ఇంట్లో వాళ్లందరికీ కూడా సూపిస్త. గరీబోళ్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మంచి ఆలోచన చేసిండు.
– నల్ల హన్మాండ్లు , కరంజి(టీ), భీంపూర్ మండలం
బెల్లంపల్లిరూరల్, జనవరి 17 : ఐదేండ్ల కింద మా ఊరిలోని సర్కారు బడిలో కండ్లపరీక్షలు చేసిన్రు. అందరికీ పరీక్షలు చేసి మందులు, కంటి అద్దాలు ఇచ్చిన్రు. కండ్లు మసకగా ఉంటే నేనుకూడా పోయి పరీక్షలు చేయించుకున్న. సెల్ఫోన్లోని అక్షరాలతో పాటు పత్రికలు చదివేందుకు ఇబ్బందయ్యేది. డాక్టర్లు చూసి రీడింగ్ అద్దాలు ఇచ్చిన్రు. అప్పటి నుంచి అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నయ్. ప్రైవేట్ దవాఖానకుపోతే వేలకు వేలు పట్టించేటోళ్లు. ఇప్పుడు రెండో విడుత కూడా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నరు. అధికారులు, వైద్య సిబ్బంది ఇంటింటికీ ప్రచారం చేసిన్రు. మళ్లీ ఓసారి కంటి పరీక్షలు చేయించుకుంటా.
– మహేందర్గౌడ్, తాళ్లగురిజాల