ఎదులాపురం, సెప్టెంబర్ 15: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని తానిషాగార్డెన్లో ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్ అండ్ ఎల్టీపీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వందేమాతర గేయాన్ని ఆలపించారు. సమాజానికి ఇంజినీర్లు అందిస్తున్న సేవలను అతిథులు కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ఉత్పత్తులకు సంబంధించిన స్టాళ్లను ప్రారంభించారు. ఆయా కంపెనీల ప్రతినిధుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన ఇంజినీరింగ్ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించారని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఇంజినీర్ల ద్వారా సమాజానికి ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రపంచ గుర్తింపు సాధించారని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అసోసియేషన్ అధ్యక్షుడు జగదీశ్వర్, యోగేశ్వర్, వేదాంత్, విజయ్, శ్రీనివాస్, రాజు, సందీప్ పాల్గొన్నారు.
ఎదులాపురం, సెప్టెంబర్ 15 : ఆదిలాబాద్లోని రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవన నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరు చేయడంపై అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే జోగు రామన్నను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సంపూర్ణ సహకారం అందించడంపై ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ భవన నిర్మాణానికి తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మారెడ్డి, పీ కిష్టయ్య, సభ్యులు అశోక్, రాజేశ్వర్రెడ్డి, గోపినాథ్గౌడ్, జలంధర్, గంగన్న, భోజారెడ్డి, నరేందర్, రమేశ్, దేవీదాస్, తదితరులు పాల్గొన్నారు.