కడెం, జూలై 26 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేరున్న కడెం జలాశయం ఇటు నిర్మల్, అటు మంచిర్యాల జిల్లాలకు వరప్రదాయిని. కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్, మంచిర్యాల మండలాల్లోని 68 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన జలాశయం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ముంచెత్తుతుండగా ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా గతేడాది ప్రాజెక్టులోకి 6 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు గేట్ల మీది నుంచి వరద వెళ్లిన పరిస్థితిని చూశాం. వరద కారణంగా నంబర్ 2 గేట్ కౌంటర్ వెయిట్ తెగి పడిపోవడంతో ఆ గేటు మొరాయించింది. దీంతో ఎగువ నుంచి వచ్చే నీటిని కేవలం 17 గేట్ల ద్వారా మాత్రమే బయటకు పంపాల్సి వచ్చిం ది. ఈ ఏడాది సైతం కేవలం 14 గేట్లు మాత్రమే పని చేయడం తో మరోసారి ముప్పు నుంచి బయట పడింది. మొత్తం నాలుగు గేట్లు పనిచేయకపోవడంతో ప్రస్తుతం రెండు గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. మరో రెండు గేట్ల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో నంబర్ 2 గేటు కౌంటర్ వెయిట్ పనులు వేగంగా చేపట్టి, యథావిధిగా నీటి విడుదలకు సిద్ధం చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నేషనల్ హైడ్రాలిక్ ప్రాజెక్టుగా గుర్తింపు
కడెం ప్రాజెక్టు పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కడెంతో పాటు, ఎస్సారెస్పీ, ఎల్ఎండీ ప్రాజెక్టులను నేషనల్ హైడ్రాలిక్ ప్రాజెక్టులుగా గుర్తించింది. అయితే వీటికి మాన్యువల్ పద్ధతిలో గేట్ల లిఫ్టింగ్ ఉండడం వల్ల భారీ వరదల సమయంలో గేట్లు ఎత్తడం ఇబ్బందిగా ఉంటుందని భావించారు. స్కాడా సాయంతో వరల్డ్ బ్యాంక్ నిధుల ద్వారా ఎల్ఎండీ, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టులకు ఇప్పటికే మిషనరీలను అందజేయడంతో పాటు వాటిని ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచారు. కాగా, మొదటి విడుతలో ఎల్ఎండీ, ఎస్సారెస్పీ పనులు చేపడుతున్న కారణంగా కడెం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఆలస్యమయ్యాయి. కడెంకు సంబంధించిన 18 వరద గేట్లకుగాను 18 మిషనరీలను ఇప్పటికే అందుబాటులో ఉంచారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు 2 లక్షల వరద రావడంతో కేవలం 11 గేట్లు మాత్రమే పని చేశాయి. అయితే మరోసారి ముప్పు వాటిల్లే ప్రమాదమున్న తరుణంలో దాదాపు 30 మంది స్థానిక యువకులు కడెం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపించారు. మాన్యువల్ పద్ధతిలో గేట్లను ఎత్తడం కష్టంగా ఉన్నప్పటికీ కడెంకు అందుబాటులోకి వచ్చిన మిషనరీలను ఏర్పాటు చేస్తే సమస్య కాస్త తీరనుంది.
అదనపు గేట్ల ఏర్పాటుతోనే ప్రయోజనం
కడెం ప్రాజెక్టుకు మరో 5 గేట్లను అమర్చితే ఎలాంటి ప్రమాదముండదని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ గేట్లను ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లోను దిగువకు విడుదల చేసే అవకాశముంటుంది.
నేడు కడెం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ బృందం
కడెం ప్రాజెక్టు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు గురువారం(సెంట్రల్ వాటర్ కమిషన్) సీడబ్ల్యూసీ బృందం సభ్యులు రానున్నట్లు ఆయకట్టు ఈఈ విఠల్ తెలిపారు. 27, 28, 29 తేదీల్లో డ్యాం సేఫ్టీ, ప్రస్తుత వరదగేట్ల పనితీరు, ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, ఔట్ఫ్లో కెపాసిటీ, ప్రాజెక్టు నిర్వాహణ వంటివాటితో పాటు అదనపు గేట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనున్నారు.
అదనపు గేట్లు ఏర్పాటు చేయాలి
గతేడాది వచ్చిన ముప్పును దృష్టిలో పెట్టుకొని మరో 5 గేట్లు ఏర్పాటు చేయాలి. ఇటీవల వరదలకు గేట్లు ఓపెన్ కాకపోవడంతో స్థానిక యువకుల సాయంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినం. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి నూతన గేట్ల ఏర్పాటుకు సహకరించాలి.
– సాదు సురేందర్, కడెం.