ఐదారు రోజులుగా కురిసిన కుండపోత వానలకు ఉమ్మడి జిల్లా చిగురుటాకులా వణికింది. ఎడతెరిపిలేకుండా వర్షం పడడంతో వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రాజెక్టులకు వరద పోటెత్తగా, యంత్రాంగం గేట్లు ఎత్తి దిగువకు వదిలింది. అనేకచోట్ల కాలనీలు నీటమునుగగా, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో జలగండం తప్పింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలించి వసతి.. భోజన సదుపాయం కల్పించింది. సర్కారు ఆదేశాలతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రత్యేకాధికారులు, కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిశానిర్దేశం చేశారు. కంట్రోల్ రూంల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మంత్రి ఐకేరెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ వరుణ్రెడ్డి సమన్వయంతో కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. మున్సిపాలిటీల సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటూ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు బాధితులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసానిస్తున్నారు.
చరిత్రలో ఊహించని వర్షాలతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఐదారు రోజులుగా విస్తారంగా పడుతున్న వర్షాలకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు చిగురుటాకుల వణికాయి. దాదాపు రెండు రోజులు ఎక్కడ చూసినా వరదే కనిపించింది. దీంతో జనం ఇళ్లు వదలి బయటికి రాలేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్, బైంసా, ఆదిలాబాద్, మంచిర్యాల పట్టణాలు చెరవులను తలపించాయి. కడెం ప్రాజెక్ట్కు భారీ వరద పోటెత్తింది. ఏ జిల్లాకు ఆ జిల్లా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరద ముంపు పొంచి ఉన్న ప్రాంతాలు, గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాల్లో తిరిగారు. ప్రజలకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రోడ్లపైనా, కాలనీల్లో నిలిచిన వరదను తొలగించే పనులను ముమ్మరం చేశారు.
అధికారుల సమన్వయం, మంత్రి, ఎమ్మెల్యేల దిశా నిర్దేశం వెరసి ఉమ్మడి పర్యవేక్షణతో నిర్మల్ జిల్లాకు జలగండం తప్పింది. వారం రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తు న్న భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో అనేక లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి. కీలకమైన కడెం ప్రాజెక్టుకు పెద్ద ముప్పు తప్పింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో పాటు ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ వరుణ్రెడ్డి తదితర అధికారులంతా కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకొని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ఈ ప్రా జెక్టు పరీవాహకంలోని 12గ్రామాల ప్రజలను ముం పు నుంచి తప్పించేందుకు యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించింది. కాగా కడెం ప్రాజెక్టు సమస్యపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న ముషారఫ్ అలీ ఫారూఖీని ప్రభు త్వం జిల్లా ప్రత్యేకాధికారిగా నియమించింది. గురువారం సాయంత్రం నుంచి ఆయన రంగంలోకి దిగి జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టులతో పాటు, వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పలు సూచనలు చేశారు. కాగా గడ్డెన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద రావడంతో లోతట్టు ప్రాంతాలన్నింటినీ అప్రమత్తం చేశారు. భైం సా పట్టణంలోని ఆర్టీసీ డిపోలో చిక్కుకున్న 8మంది సిబ్బందిని అధికారులు సురక్షితంగా కాపాడగలిగారు. నిర్మల్లోని జీఎన్ఆర్ కాలనీ వాసులను ముంపు నుంచి కాపాడి పునరావాస కేంద్రాలకు తరలించారు. నష్టంపై కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు ప్రాథమిక సర్వేలు మొదలు పెట్టారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి జాగ్రత్తలు చేపట్టింది. చాలా మంది తమ సమస్యలను కంట్రోల్రూంకు చేరవేయడంతో.. అక్కడి నుంచి మండల, గ్రామస్థాయి అధికారులకు రక్షిత చర్యలకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడంతో ముప్పు తప్పింది.
జిల్లాలో శుక్రవారం 38.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గురువారం వరకు పొంగిన వాగులు, మత్తడి దూకిన చెరువులు శాంతించాయి. ప్రాజెక్టులు, జలపాతాలకు నీటి ప్రవాహం తగ్గింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ, విద్యుత్, పశు సంవర్థక, ఇరిగేషన్, పంచాయతీ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్ మండలం కన్పాం గ్రామంలో కూలిన ఇండ్లను పరిశీలించి, బాధితులకు ఆర్థిక సాయం అందించారు. సాత్నాల ప్రాజెక్టును సందర్శించి వరద పరిస్థితి, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ గుడిహత్నూర్ మండలం తొక్కిగూడ, తలమడుగు మండలం సకినాపూర్లో గ్రామాల్లో పర్యటించి నీటి మునిగిన పంటలను పరిశీలించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంద్రవెల్లి మండలం ముత్నూర్, అంజీ, వడ్గాం గ్రామాల్లో పర్యటించి వరదల వల్ల పాడయిన రోడ్లను పరిశీలించారు. కలెక్టర్ రాహుల్రాజ్ ఇంద్రవెల్లి మండలం ముత్నూర్లో త్రివేణి సంఘం ప్రాజెక్టు వరద నీరు కారణంగా కోతకు గురైన ఆదిలాబాద్, ఉట్నూర్ రోడ్డును పరిశీలించారు. బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ మండలంలోని నక్కలవాడ, పట్నాపూర్ గ్రామాల్లో పర్యటించి ఇండ్లలోకి వరద నీరు చేరిన బాధితులకు సాయం అందించారు.