భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి జోరుగా క్యాంపెయిన్ చేశారు. మూడు నెలలకుపైగా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచారాస్ర్తాలుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్పీడ్ పెంచారు. గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలి పించాలని అభ్యర్థించారు. కారు టాప్గేర్లో దూసుకుపోగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ లు చతికిల పడ్డాయి.
సీఎం కేసీఆర్ నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు రోడ్ షోలకు జనం పోటెత్తారు. కాగా.. ప్రచారం చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు భారీ జనంతో ర్యాలీలు నిర్వహించడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. ఆదిలాబాద్లో జోగు రామన్న, బోథ్లో అనిల్ జాదవ్ ప్రచారానికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టారు. ప్రజల నుంచి భారీ స్పందన లభించించడంతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులు విస్తృతంగా నిర్వహించారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు జోగు రామన్న, అనిల్ జాదవ్లు దూకుడు పెంచడంతో ప్రతిపక్షాలు బేజారయ్యాయి. పట్టణాలు, గ్రామాల్లో సమావేశాలు, ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల నుంచి ఓట్లను అభ్యర్థించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా ప్రాంతాల నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
యువత, మహిళలు, వృద్ధులు, స్థానికులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ నాయకుల సమావేశాలకు హాజరయ్యారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో అమలు చేస్తున్న పథకాల ఫలితంగా త మ ఉపాధి మెరుగుపడిందని అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కడుతామని ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించారు. స్థానికులు డ ప్పు చప్పుళ్లు, మంగళహారతులు, పటాకులు, నృత్యాలు చేస్తూ స్వా గతం పలికారు. కాంగ్రెస్, బీజేపీ అగ్రనాయకులు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రజల నుంచి అంతగా స్పందన లభించలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు అభివృద్ధికి నోచుకోకపోగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల ఫలితంగా అభివృద్ధి జరిగింది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, రవాణా, ఇతర రంగాల్లో రెండు నియోజకవర్గాలు గణనీయమైన ప్రగతి సాధించాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో రూ.5,250 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాగా, బోథ్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ప్రతి కుటుంబంలో మూడు నుంచి ఆరు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రభుత్వం పథకాల ఫలితంగా గ్రామాల్లోని ప్రజల జీవనోపాధి మెరుగుపడింది.
గతంలో నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, తమకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ను ఆదరిస్తామని ప్రజలు అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్నారు. చివరి రోజు ప్రచారానికి ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన గులాబీ పార్టీ ప్రచారానికి ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు.
నిర్మల్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ) : గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షమ పథకాలు.. వచ్చే ఐదేళ్లలో అమలు చేసే అంశాలపై విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ అభ్యర్థులకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆత్మీయ సమ్మేళనాలు, మండల, నియోజకవర్గాలవారీగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాలతో విస్తృత ప్రచారం చేశారు. కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములవుతూ తమదైన శైలిలో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడగా, కారు టాప్ గేర్లో ఉంది.
నిర్మల్లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఇప్పటికే ప్రచారం చేయగా, రెండు రోజులుగా మిగతా వార్డుల్లో ఇంటింటా ప్రచారం చేశారు. అల్లోలకు మద్దతుగా పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి వీ. సత్యనారాయణగౌడ్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డిలు విస్తృత ప్రచారం నిర్వహించారు. అల్లోల కుటుంబ సభ్యులు గౌతంరెడ్డి, దివ్యారెడ్డి, తిరుపతిరెడ్డిలు కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ అన్ని గ్రామాలు చుట్టేశారు. ఆయనకు మద్దతుగా ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి కూడా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ నుంచి వచ్చిన డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుండడం, ఇక్కడ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్రెడ్డికే మద్దతు పలుకడంతో ఆయన గెలుపు ఖాయమంటున్నారు. ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ ప్రచారంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల కంటే ముందున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. బీఆర్ఎస్ తరఫున పార్టీ సీనియర్ నాయకులు రవీందర్రావు, ఎమ్మెల్సీ దండె విఠల్తోపాటు ఇటీవలే బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన పెంబి జడ్పీటీసీ జానూబాయిలు ముమ్మరంగా ప్రచారం చేశారు.
నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లు గ్రాండ్ సక్సెస్ కావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. ఈ నెల 2న నిర్మల్లో, 3న ముథోల్ నియోజకవర్గంలోని భైంసా పట్టణంలో జరిగిన సీఎం సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. అలాగే తాజాగా ఈ నెల 26న ఖానాపూర్లో సీఎం పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభకు 60 వేలకు పైగా ప్రజలు తరలి వచ్చి బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలోనే తమకు మేలు జరిగిందని, మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తేనే తమ బతుకులకు భరోసా ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు.