కాగజ్నగర్, అక్టోబర్ 14 : జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలంటే విలువైన ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించి ఈ ప్రాంత యువత ఉద్యోగాలు సాధించేలా కృషి చేశామన్నారు. ఇటీవల మా వద్ద శిక్షణ పొందిన 692 మంది టెట్లో అర్హత సాధించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న గ్రూపు-3, గ్రూపు-4 శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నదని, పట్టుదలతో చదివి సిర్పూర్ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలని కోరారు. శిక్షణ సమయంలో టీ, భోజన వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో శాశ్వాత బీసీ స్టడీ సెంటర్ మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏ చిన్న అవసరమొచ్చినా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
మహాత్మా జ్యోతిబాపూలే-2 ప్రారంభం..
కాగజ్నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్పై మహాత్మా జ్యోతిబాపూలే-2 బాలికల విద్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. విద్యాలయంలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు సైతం పిల్లలపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ, కన్వీనర్ వెంకట ప్రసాద్, ప్రిన్సిపాళ్లు లక్ష్మీనరసింహం, జయప్రద, మంగ, అధ్యయన కేంద్రం ఇన్చార్జి నాగరాజు, సర్పంచ్ టేకం భీంబాయి, ఎంపీటీసీ తారాబాయి పాల్గొన్నారు.