కాగజ్నగర్, జనవరి 17: కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఈ నెల 20న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి 4458 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నుంచి 983 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా నుంచి 1208 మంది దరఖాస్తు చేసుకోగా, 6 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి 1188 మంది విద్యార్థులకు, ఏడు పరీక్షా కేంద్రాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 1079 మందికి ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.