కాసిపేట, మే 8 : తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు వెంటనే అనుమతులిచ్చి ప్రోత్సహిస్తున్నామని, వాటి ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ విస్తరణలో భాగంగా రూ.2000 కోట్లతో తలపెట్టిన నాలుగో ప్లాంట్ పనులను రాష్ట్ర హోం, రక్షణ, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రి ఎండీ మహమూద్ అలీ, రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీఎస్ఎండీసీ ఎండీ రాజశేఖర్ రెడ్డి, ఓరియంట్ ఎండీ, సీఈవో దీపక్ క్షేత్రపాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా భూమి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఓరియంట్ మ్యాప్ను పరిశీలించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేవాపూర్ ఓరియంట్ పరిశ్రమ విస్తరణతో 4000 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. పరిశ్రమలను తెలంగాణ రాష్ర్టానికి తీసుకురావడానికి దాని వెనుక చాలా శ్రమ ఉంటుందని, అన్ని రాష్ర్టాలతో పోటీ పడి ఒప్పంచి పరిశ్రమలను తీసుకురావడం జరుగుతుందన్నారు. దేవాపూర్ను సీఎస్ఆర్ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం ప్రకృతి పరంగా చూడముచ్చటగా ఉందని, దీనిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఓరియంట్ కంపెనీ విస్తరణకు మరో రూ.2000 కోట్లు పెట్టుబడి పెడుతామని, మరో 4000 మందికి ఉపాధి కల్పిస్తామని, అటవీ, పర్యావరణ తదితర అనుమతులు వచ్చే విధంగా చూడాలని యాజమాన్యం కోరిందని, ఇందుకు వెంటనే అనుమతులు ఇస్తామని వారికి భరోసానిచ్చినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
నూతన ప్లాంట్ ప్రారంభానికి స్వయంగా వచ్చి, ఇక్కడే భోజనం చేస్తానన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా స్థానికులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన కోరారు. దేశంలోనే అత్యధిక ఆదర్శ గ్రామాల అవార్డులను దక్కించుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కొనియాడారు. హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెం పొందించి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాయువు అందిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు.
ఓరియంట్ ఎండీ దీపక్ క్షేత్రపాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నదని, ఈ మేరకు పరిశ్రమల అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, ఓరియంట్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు పూస్కూరి రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్ర య్య, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, సర్పం చ్ మడావి అనంతరావు, ఎంపీటీసీ అట్టెపల్లి సుమలత శ్రీనివాస్, ఓరియంట్ ప్రెసిడెంట్ సత్యబ్రతా శర్మ, యూనిట్ హెడ్ ఎంపీ జ్యోషి, హెచ్ఆర్ జీఎం ఆనంద్ కులకర్ణి, లైజన్ హెడ్ నరేంద్ర, ఓరియంట్ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.