మంచిర్యాల టౌన్, జూన్ 20 : రెండున్నరేండ్ల పాలనలో కాంస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని, ఇది పాలన చేతగాని ప్రభుత్వమని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు విమర్శించారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల కితం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన టార్గెట్ కన్నా గింజ ధాన్యం కూడా ఎక్కువ కొనుగోలు చేయమని ప్రకటించడం అత్యంత బాధ్యతారాహిత్యమైన విషయమని మండిపడ్డారు.
గతంలో రేవంత్రెడ్డి ప్రతీ గింజ కొనాలని డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పంటలు పండించడం మొదలుకుని.. యూరియా కొనుగోలు, గిట్టుబాటుధర, ధాన్యం కొనుగోళ్లు, తరలింపు.. ఇలా అన్ని విషయాల్లో రైతులను గోస పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రైతులకు అన్ని విధాలా భరోసా ఇచ్చారని ఆయన అన్నారు. ప్రాజెక్టులను నిర్మించడం, సాగునీరు అందిచడం, గోదాములు నిర్మించడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, రైతులకు ఉపయోగపడే రైతువేదికల నిర్మాణం, రైతుభరోసా, రైతు బీమా , గిట్టుబాటు ధర, తదితర విషయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఎంతో ప్రేమగా చూసుకున్నారని గుర్తు చేశారు.
మరి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి వెన్నుముఖ లాంటి రైతులను మోసం చేస్తున్నదని, ఏకంగా కేబినెట్ మీటింగ్లోనే కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ ధాన్యం కొనేదే లేదని ప్రకటించడం చాలా దుర్మార్గం అని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు తరుగు, రవాణా విషయంలో రూ.20 కోట్లు నష్టపోయారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులందరికీ రైతు బీమా చేయించిందని, ఎవరైనా రైతులు చనిపోతే వారి కుటుంబానికి బీమా సొమ్ము వచ్చేదని, దాంతో ఆ కుటుంబానికి ఎంతో అండగా ఉండేదన్నారు.
ఈ ప్రభుత్వం బీమా డబ్బు కట్టలేదని, దీంతో చనిపోయిన రైతుల కుటుంబాలకు బీమా సొమ్ము రావడం లేదని అన్నారు. రూ. 440 కోట్లు బీమా సొమ్ము కడితే రైతుబీమా వర్తిస్తుందన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక రైతుబంధు విషయంలో నానా హంగామా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మూడు ఎకరాలకు ఒకసారి, రెండెకరాలకు ఓసారి చొప్పున ఇస్తూ, అదేదో ఘనకార్యం చేసినట్లు మీటింగ్లు పెడుతున్నారని, ఇందుకు ఐదారు కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, నస్పూరు పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీజీకేఎస్ నాయకుడు పెట్టెం లక్ష్మణ్, నాయకులు తోట తిరుపతి, పడాల రవీందర్, సుధీర్ పాల్గొన్నారు.