ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజులుగా కుండపోతగా వానలు పడుతున్నాయి. ప్రాణహిత, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గేట్లు ఎత్తి దిగువకు వదులుతుండగా, చెరువులు మత్తళ్లు దుంకుతూ.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారగా, ఇన్ఫ్లో తగ్గడంతో అధికార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, అక్కడక్కడా ఇండ్లు కూలిపోయాయి. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామ పంచాయతీ పరిధిలోని తోయగూడకు చెందిన రంభాబాయి అనారోగ్యంతో చనిపోగా, ఆమె మృతదేహాన్ని ఎడ్లబండిపై వాగును దాటించేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండగా, ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
– మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, జూలై 21 (నమస్తే తెలంగాణ)
మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్/ఆదిలాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఐదు రోజులుగా కుండపోత వానపడుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సరాసరి వర్షపాతం 39.9 మిల్లీమీటర్లు, నిర్మల్ జిల్లాలో సగ టు వర్షపాతం 57.8 మిల్లీమీటర్లు, మంచిర్యాల జిల్లాలో 41.1 మిల్లీ మీటర్ల, ఆదిలాబాద్ జిల్లాలో 57.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాంగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల -చింతలమానేపల్లి మండలాల మధ్య గల చింతలపాటి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఏరియాలోకి వరద చేరింది. ముత్తంపేటలో రోడ్లపై నీరు ప్రవహించడంతో జేసీబీ సాయంతో తొలగించారు. తలోడిలో రాత్రి వర్షానికి గ్రామానికి చెందిన గొడిసెల దేవమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. మంచిర్యాల జిల్లా నెన్నెల సమీపంలోని లంబాడీతండాఎర్రవాగు రాత్రి నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ భూమేశ్వర్, ఆర్ఐ గణేశ్ వరద స్థితిని పరిశీలించి పోలీసులను కాపలా ఉంచారు. నెన్నెలకు చెందిన రైతు తోట తిరుపతి ఇల్లు గోడలు కూలిపోయాయి.
శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఓపెన్కాస్టు గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓబీ తొలగింపు సైతం నిలిపి వేశారు. పెగడపల్లి వద్దగల ఈదుల వాగు, టేకుమట్ల వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. టేకుమట్ల నుంచి శెట్పల్లి, కుందారం, శివ్వారం గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. పెగడపల్లి వాగు ఉప్పొంగడంతో గంగిపెల్లి, పెగడపల్లి, ఎల్కంటి గ్రామాల ప్రజలు అవస్థలు పడ్డారు. చెన్నూర్ మండలం అన్నారం బ్యారేజ్ను, కోటపల్లి మండలం ప్రాణహిత గోదావరి, బతుకమ్మ వాగు వంతెనతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టును కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి పరిశీలించారు. తెలంగాణ – మహారాష్ట్ర అంతర్రాష్ట్ర చెక్పోస్టును సందర్శించారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం గుండేగాం గ్రామం వద్ద చిన్న సుద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గుండేగాం, మహగాం, పార్డీ(బీ) తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంటాల మండలంలో కురిసిన వర్షాల కారణంగా ఓలా నుంచి సూర్యాపూర్, మెదన్పూర్ గ్రామాలకు వెళ్లే రోడ్డులో లో లెవెల్ వంతెనపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సారంగాపూర్ మండలం బండరేవు తండాకు వెళ్లే రోడ్డు భారీ వర్షాల కారణంగా కోతకు గురైంది. దీంతో ఈ రూట్లో వాహనాలను అనుమతించడం లేదు.
అలాగే బాసర నుంచి కిర్గుల్(బీ) వెళ్లే మార్గంలో బ్రిడ్జిపై నుంచి వాగునీరు ప్రవహిస్తోంది. బాసర మండలల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల రవీంద్రపూర్, శారదానగర్ కాలనీల్లోని లోతట్టు ప్రాంత నివాస గృహాల్లోకి వర్షపు నీరు చేరింది. మండలంలోని కిర్గుల్ (బీ)లో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రెండు ఇండ్ల పైకప్పు కూలింది. ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చర, బజార్హత్నూర్ మండలం కనకాయి జలపాతాలకు నీటి ప్రవాహం పెరిగింది. బజార్హత్నూర్, ఇంద్రవెల్లి మండలం మూత్నూర్ చెరువుల్లో చేపలను పట్టుకునేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇచ్చోడ నుంచి సిరికొండ వెళ్లే రోడ్డు, తాత్కాలిక వంతెన చెడిపోవడంతో, రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి నిర్మాణ లోపం కారణంగా తమ గ్రామంలోకి నీరు చేరిందని ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గిన్నెరా గ్రామపంచాయతీ పరిధిలోని తోయగూడ గ్రామానికి చెందిన కొడప రంభాబాయి(56) అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్లో శుక్రవారం మృతి చెందింది. దీంతో 108 అంబులెన్స్తో మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు గ్రామానికి బయల్దేరారు. మర్కాగూడ వాగు వద్ద అంబులెన్స్ నిలిచిపోయింది. వాగు దాటలేని పరిస్థితి ఉండడంతో, ఎడ్లబండిని తెప్పించి, వాగు దాటించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్టు నిండిపోవడంతో 14 గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 45వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, 1,31,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శుక్రవారం ఉదయం లక్ష క్యూసెక్కుల ఇన్ప్లో రాగా గేట్లను ఎత్తారు. కాగా మొత్తం 18 గేట్లలో ఆరు గేట్లు కాసేపు తెరచుకోలేదు. స్థానిక యువత సాయంతో వెంటనే మరమ్మతులు చే యించి పని చేయనివాటిలో రెండు గేట్లను ఎత్తారు. అప్పటికీ వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పైనున్న కడెం నుంచి వరద వచ్చి చేరడంతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. దీంతో శుక్రవారం ఉదయం నాలుగు గేట్లను స్వల్పంగా ఎత్తి కిందికి నీరు వదిలిన అధికారులు, మధ్యాహ్నం 10గేట్లను, సాయంత్రానికి 17 గేట్లను స్వల్పంగా పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 2,47,882 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 1,78,410 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
దీంతో జైపూర్ మండలంలో ఉన్న సుందిళ్ల ప్రాజెక్టుకు వచ్చే వరద 76 వేల క్యూసెక్కులు దాటింది. దీంతో మొత్తం 60 గేట్లను ఎత్తి కిందకు నీరు వదులుతున్నారు. చెన్నూర్ మండలంలోని అన్నారం ప్రాజెక్టుకు 42,851 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 35 గేట్లను ఎత్తి 47,250 నీటిని కిందకు వదులుతున్నారు. భీ మారం మండలంలోని గొల్లవాగు, వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టులకు సైతం వేల క్యూసెక్కుల్లో నీరు వచ్చి చేరుతుంది. ఆసిఫాబాద్ జిల్లాలో ని కుమ్రంభీం ప్రాజెక్ట్కు పై నుంచి వరదతో 3030 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఆరు గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టుకు 1500 క్యూసెక్కులు ఉండగా, ప్రాజెక్ట్ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ల ద్వారా 60 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పాల్వాయి పురషోత్తం రావు ప్రాజెక్ట్, చెలిమవాగు ప్రాజెక్టుల్లో భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆదిలాబాద్ జిల్లా లో సాత్నాల ప్రాజెక్ట్కు 250 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, మత్తడివాగు ప్రాజెక్టుకు 460 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్కు 6,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, ఒక గేట్ను ఎత్తి 5,188 క్యూసెక్కులు వదులుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టులోకి 2,280 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ప్రస్తుతానికి అవుట్ఫ్లో ఏం లేదు.
వరద తాకిడి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్, రామగుండం సీపీ రెమా రాజేశ్వరీ, డీసీపీలు, ఎసీపీలు అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టలను పరిశీలించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి కడెం ప్రాజెక్ట్ను సందర్శించారు. ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో ఆధారంగా నీటి విడుదలపై అధికారులను ఆరాతీసి పలు సూచనలు చేశారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోశ్ వరద పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే రెండు రోజులు వర్ష సూచన ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, జిల్లా అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు. వరదల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, సాయం కోసం 08736-250501 నంబర్కు సంప్రదించాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.