దస్తురాబాద్,డిసెంబర్ 4 : ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నది. పంచాయతీలు జారీ చేసే వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. సులభంగా సర్టిఫికెట్లు పొందేలా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని కార్యదర్శులు పరిశీలించి, డిజిటల్ సంతకాలు చేస్తారు. అనంతరం మీ-సేవ కేంద్రాల నుంచి సర్టిఫికెట్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు. జనన,మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కీ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఫోర్జరీకి అవకాశం లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందనున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. త్వరలో డిజిటల్ సంతకాల ద్వారా సర్టిఫికెట్ల జారీ ప్రారంభించనున్నారు.
కొత్త విధానం ఇలా…
పంచాయతీల ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను మాన్యువల్ పద్ధతిలోనే జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో ఆన్లైన్లో ఆైప్లె చేసుకున్నా వెంటనే అందులో నమోదు చేసిన ఫోన్ నంబర్కి దరఖాస్తు నంబర్ మెసేజ్ వస్తుంద. పత్రం సిద్ధం కాగానే దరఖాస్తుదారుడి ఫోన్ నంబర్కు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. ఇలా డిజిటల్ సంతకంతో కూడిన పత్రా న్ని మీ-సేవ, పంచాయతీ కార్యాలయాల్లోకి వెళ్లి ప్రింట్ తీసుకోవచ్చు. కొత్త విధానం అమల్లోకి రావడంతో పంచాయతీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. రెండు,మూడు రోజుల వ్యవధిలో సర్టిఫికెట్లు పొందడానికి అవకాశం ఉంటుం ది. తహసీల్ కార్యాలయంలో కుల, ఆదాయ, నివాస తదితర ధ్రువీకరణ పత్రాల జారీ తరహాలోనే పంచాయతీల్లో జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు అందుబాటులోకి రానున్నాయి.
కార్యదర్శుల వివరాల సేకరణ పూర్తి..
మండలంలో 13 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యర్శుల డిజిటల్ సంతకాలను బయోమెట్రిక్తో నమోదు చేశారు. డిజిటల్ టోకెన్లను జారీ చేయడానికి కార్యదర్శుల డిజిటల్ సంతకాలు, వివరాలను కంప్యూటర్ ఆపరేటర్ సేకరించారు. ప్రతి కార్యదర్శికి సంబంధించి సమగ్ర వివరాలను ప్రత్యేక సాఫ్ట్వేర్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ సంతకాల సేకరణ పూర్తి కాగా, కార్యదర్శులకు డిజిటల్ కీలను జిల్లా ఉన్నత అధికారులు అందజేశారు.
సేవల్లో పారదర్శకత
ప్రజలకు ఇబ్బంది లేకుండా జనన,మరణ సర్టిఫికెట్ల కోసం కొత్త విధానాన్ని పంచాయతీ రాజ్ శాఖ తీసుకు వచ్చింది.మండలంలోని 13 పంచాయతీల కార్యదర్శుల వ్యక్తిగత వివరాలను సేకరించి టోకెన్ల కోసం ఆన్లైన్లో ఆప్లోడ్ చేశాం.వారందరికీ టోకెన్లు అందజేశాం. మీ-సేవ కేంద్రాల ద్వారా జనన,మరణ ధ్రువీకరణ పత్రాల కోసం డిజిటల్ సంతకాల కోసం ఆప్షన్లు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం సేవలు సాంకేతికతలోనే అందుబాటులోకి రానున్నాయి. సేవల్లో మరింత పారదర్శకత పెరుగుతుంది. ప్రజలు కార్యాలయ చుట్టూ తిరిగే అవసరం ఉండదు. మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.
పీ,అనిల్ కుమార్,మండల పంచాయతీ అధికారి,దస్తురాబాద్