నిర్మల్ అర్బన్, జూన్ 25 : నిర్మల్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు బస్సుల ఫిట్నెస్పై యాజమాన్యాలు దృష్టి సారించకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది. 15 ఏండ్లకు పైబడి కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిప్పుతున్నారు. ఇంకా.. ఇతర రాష్ర్టాల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాహనాలకు పైన రంగులు అద్దుతూ రోడ్లపై తిప్పుతున్నారు. ఇటువంటి బస్సుల వల్ల నిర్మల్ జిల్లాలో చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగినా తమకు ఏం పట్టింపు లేదన్నట్లు వాహనాలను నడిపిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో 285 ప్రైవేటు పాఠశాల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 220కిపైగా బస్సులు ఫిట్నెస్ పూర్తి చేసుకోగా.. మిగిలిన బస్సులు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. పాఠశాలల ప్రారంభానికి ముందే ఫిట్నెస్ చేయించాల్సి ఉండగా.. బస్సు యజమానులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 12 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. నిర్మల్ పట్టణంలో గత మంగళవారం ఎంవీఐ అధికారులు పది బస్సులను తనిఖీ చేసి మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో ఖానాపూర్లో ఏడు బస్సులు తనిఖీ చేసి రెండు కేసులను నమోదు చేశారు. భైంసాలో 15 బస్సులను తనిఖీ చేసి మూడు కేసులను నమోదు చేశారు.