మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 8 : ఆదర్శ పాఠశాలల్లో విద్యా బోధన ఉత్తమంగా ఉండడంతో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పక్కా భవనాలు, ఆటల్లో ముందంజ, సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం, పూర్తి స్థాయి సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో బడులు పకడ్బందీగా కొనసాగుతున్నాయి. అన్ని చోట్ల ప్రతి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. యానిమేషన్, బ్యూటీషియన్, మైక్రో ఇరిగేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, హెల్త్కేర్, వెల్నెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ వంటి పలు రకాల కోర్సులను ఎంపిక చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. యేటా పదో తరగతిలో అధిక మంది విద్యార్థులు ఉత్తీర్ణతతోపాటు, మెరుగైన జీపీఏ సాధిస్తున్నారు.
ఐదు మోడల్ స్కూళ్లలో…
మంచిర్యాల జిల్లాలోని ఐదు మోడల్ స్కూల్స్లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో గల మోడల్ స్కూల్తోపాటు దండేపల్లి మండలంలోని లింగాపూర్, మందమర్రి, కాసిపేట, కోటపల్లి మండల కేంద్రాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో పాఠశాలలో వంద సీట్లతోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది.
ఏప్రిల్లో ప్రవేశ పరీక్ష…
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో పూర్తి ప్రవేశాలు, ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఆరో తరగతిలో చేరే విద్యార్థులకు ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ విద్యార్థులు రూ.150, వికలాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.75 ఫీజుగా చెల్లించాలి. ఇందుకు సంబంధించి దరఖాస్తులు వెబ్సైట్ (www.telanganams.cgg.gov.in) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వీరు అర్హులు..
ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరవధికంగా 4, 5 తరగతులు చదివి ఉండాలి. 2022-23 సంవత్సరానికి గాను ఐదో తరగతి చదువుతూ పైతరగతికి అర్హత పొందిన వారై ఉండాలి. అల్పాదాయ వర్గాల(ఈబీసీ) వారికి ప్రాధాన్యమిస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తులు..
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఆరో తరగతి, పై తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ గడువుగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తులు నడుస్తున్నాయి. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఉత్తమమైన బోధనతోపాటు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేయడం జరుగుతుంది. యేటా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– రజని, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్, మంచిర్యాల