తొలిరోజు ప్రశాంతం
పరీక్ష రాసిన 16550 మంది విద్యార్థులు
ఆదిలాబాద్లో 788.. నిర్మల్లో 657 మంది గైర్హాజరు
నిర్మల్ అర్బన్, మే 6 : ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 7722 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఇందులో జనరల్ విద్యార్థులు 6551 , వొకేషనల్లో 1171 మంది ఉన్నారు. తెలుగు, సంస్కృతం, అరబ్బీ, ఉర్దూ పరీక్షల కోసం 7722 మంది విద్యార్థులకు 26 పరీక్షా కేంద్రాల్లో 7065 మంది పరీక్షలు రాశారు. (జనరల్ 6135, వొకేషనల్ 930) 657 మంది విద్యార్థులు ( జనరల్ 416, ఒకేషనల్ 241) గైర్హాజరయ్యారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని ముందుగా అధికారులు ప్రకటించడంతో విద్యార్థులు సకాలంలో చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నిర్మల్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ రాంబాబు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ శివప్రసాద్, అధికారులు ఉన్నారు.
మొదటి రోజు 9490 మంది హాజరు
ఆదిలాబాద్ రూరల్, మే 6 : ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు మాస్కు ధరించాలని ఇన్విజిలేటర్లు సూచించారు. ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో ఏఎన్ఎం వద్ద ఉన్న మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాన్ని డీఐఈవో రవీంద్ర కుమార్ పరిశీలించారు. మొదటి రోజు పరీక్షకు 10278 మం ది విద్యార్థులకు 9490 మంది హాజరు కాగా 788మంది గైర్హాజరైనట్లు డీఐఈవో తెలిపారు.
నేడు ఇంటర్ సెకండియర్ పరీక్షలు
నిర్మల్ అర్బన్, మే 6 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.నిర్మల్ జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 7635 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో జనరల్లో6374 మంది, వొకేషనల్ కోర్సుల్లో 1172 మంది, ప్రైవేట్గా 89 మంది పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.