నిర్మల్ అర్బన్, అక్టోబర్ 20 : మహిళలను ప్రలోభ పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్కు పాల్పడిన అంతర్రాష్ట్ర కిడ్నాపర్ల ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కిడ్నాప్కు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం వెల్లడించారు. జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామానికి చెందిన బానోత్ మారుతి, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వివాహితతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పథకం ప్రకారం పెద్దపల్లి జిల్లా కమ్మరికుంటకు చెందిన రవి కుమార్ను కిడ్నాప్ చేసి బంధించారు. డబ్బుల కోసం బెదిరించారు. ముఠాలోని మహిళకు ఆరు నెలల క్రితం కుమ్మరికుంటకు చెందిన వ్యక్తితో వివాహమైంది. తనకు పిల్లలు కలుగడం లేదని అదే గ్రామంలోని ఆర్ఎంపీ రవి కుమార్ను తరచూ సంప్రదిస్తుండగా వారి మధ్య పరిచయం ఏర్పడింది.
ముఠాలోని సభ్యులు వివాహితతో పథకం ప్రకారం రవికుమార్కు వాట్సాప్ చాటింగ్ చేయించారు. ఈ క్రమంలో రవి కుమార్కు ఫోన్ చేయించి నిర్మల్ బస్టాండ్కు రావాలని పిలిపించారు. రవి ఈనెల 18న నిర్మల్కు రాగా, వివాహిత తన బంధువైన రాథోడ్ జ్ఞానేశ్వర్తో వచ్చి కారులో రవి కుమార్ను మహారాష్ట్ర సరిహద్దు ధనోరా అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లారు. అక్కడ ముఠాలోని మారుతి, ఉద్ధవ్, కార్తిక్, జానేశ్వర్ రవి కుమార్ను బంధించారు. రూ.5 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపుతామని తుపాకీతో బెదిరించారు. సాయం త్రం 5 గంటల సమయంలో బాధితుడిని శ్రావణ్, మరో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు కారులో ఎక్కించుకున్నారు. మారుతి బైక్పై కంకెట గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. మారుతి, కార్తిక్, ఉద్ధవ్ రవిపై దాడిచేయడంతో రూ.25 వేలు చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. రాత్రి 11.30 గంటలకు తన మిత్రుడు రామకృష్ణకు ఫోన్ చేసి ఫోన్పే ద్వారా డబ్బులు పంపమన్నాడు.
రవి కుమార్ లొకేషన్ ట్రేస్ చేస్తానని గట్టిగా అరవడంతో మారుతి అతడిని ఉద్ధవ్, కార్తిక్లకు అప్పజెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉద్ధవ్, కార్తిక్ రవిని మోటార్ సైకిల్పై వంజర్ గ్రామం వైపు తీసుకెళుతుండగా..అనుమానంతో గ్రామస్తులు వెంట పడ్డారు. దీంతో ఉద్ధవ్, కార్తిక్ రవికుమార్ను వదిలి పారిపోయారు. బాధితుడు సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నిందితులను పట్టకున్నారు. దేశవాళి తుపాకీ, రెండు తూటాలను మారుతికి రూ.50 వేలకు విక్రయించిన మధ్యప్రదేశ్కు చెందిన రాహుల్ రజాక్, సహకరించిన వేల్పూర్ మండలం అమీనపూర్ గ్రామస్తుడు అంకమొల్ల శ్రావణ్ పరారీలో ఉన్నా రు. బానోత్ మారుతి, నిర్మల్ జిల్లాకు చెందిన మహిళ, రాథోడ్ ఉద్ధవ్, రాథోడ్ కార్తిక్, రాథోడ్ జ్ఞానేశ్వర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి దేశీవాళి తుపాకి, 7.65 ఎంఎం రెండు బుల్లెట్లు, ఐదు సెల్ఫోన్లు, రెండు బైక్లు, తాళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కేసును త్వరగా ఛేదించిన ఏఎస్పీ ప్రసాద్, డీఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ వెంకటేశ్, సారంగపూర్ ఇన్చార్జి ఎస్ఐ చంద్రమోహన్,గ్రామస్తులను ఎస్పీ అభినందించారు.
వంజర్ గ్రామస్తులకు సన్మానం
సారంగాపూర్, అక్టోబర్ 20 : మండలంలోని వంజర్లో గస్తీ నిర్వహిస్తున్న గ్రామస్తులు కిడ్నాపర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. కిడ్నాపర్లను పట్టించిన గ్రామస్తులను న్యాయవాది కొరిపెల్లి సుధారెడ్డి అభినంధించి సత్కరించారు. ఇందులో నాయకులు కొరిపెల్లి రాజేశ్వర్రెడ్డి, లెక్చరర్ రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.