నిర్మల్ అర్బన్, మార్చి 13 : ఇంటర్ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పరీక్షల చీఫ్ సూపరిండెంటెండెంట్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశాలు పూర్తిచేసి అధికారులను సిద్ధం చేశారు. పరీక్ష పత్రాలు సైతం ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. ఈ నెల 15వ తేదీన ఫస్టియర్, 16న సెకండియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లాలో మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు ఎప్పటికప్పుడు ఫ్ల్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయని, మాస్ కాపీయింగ్కు పాల్పడితే విద్యార్థులను డిబార్ చేయడంతో పాటు ఇన్విజిలేటర్, నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు మాధ్యమిక శాఖ అధికారులు సిద్ధమయ్యారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 15201 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’ డీఐఈవో పరశురాంను ఇంటర్వ్యూ చేయగా పలు వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
నమస్తే : జిల్లాలో ఎంత మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు?
డీఐఈవో : నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నుంచి మొత్తం 15201 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో మొత్తం 7540 విద్యార్థులుండగా, రెగ్యులర్-6207, వొకేషనల్ -1333 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 7661 మంది విద్యార్థులు ఉండగా, రెగ్యులర్- 6463, వొకేషనల్- 1198 మంది హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలి.
జిల్లాలో ఎన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.?
డీఐఈవో : జిల్లాలో మొత్తం 15201 మంది పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజక వర్గాల్లో మొత్తం 23 కేంద్రాలను ఏర్పాటు చేశాం. 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 23 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 25 మంది విద్యార్థులకో ఇన్విజిలేటర్ చొప్పున దాదాపు 500 మందిని నియమించాం. పరీక్షల నిర్వహణపై ఇన్విజిలేటర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశాం. పరీక్ష నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంట్ అధికారులతో సమావేశాలు నిర్వహించాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా కఠిన నిబంధనలు జారీ చేశాం.
జిల్లాలో సమస్మాత్మక పరీక్షా కేంద్రాలు
డీఐఈవో : జిల్లాలోని ముథోల్, భైంసాలోని పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాం. ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. నిత్యం ఈ కేంద్రాల్లో సిట్టింగ్ స్వాడ్లు, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాయి.
కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
డీఐఈవో : వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాల్సిన ఏర్పాట్లపై పరీక్షా కేంద్రాల యాజమాన్యాలకు వివరించాం. ఇప్పటికే అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాం. పరీక్షలకు అనువుగా ఉన్న కేంద్రాలను మాత్రమే ఎంపిక చేశాం. వేసవి దృష్ట్యా ప్రతి కేంద్రంలోని తరగతి గది ముఖద్వారంలో తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు, కూలర్లు, మరుగుదొడ్లు, ఆరోగ్య సిబ్బందిని నియమించాం.
హాల్ టికెట్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా?
డీఐఈవో : పరీక్షల సమయంతో కళాశాల ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని విద్యార్థులను ఒత్తిడి చేస్తే, సంబంధిత కళాశాలలపై విద్యార్థులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.హాల్ టికెట్ కోసం కళాశాలకు వెళ్లకుండా ప్రభుత్వం తమ హాల్టికెట్లను ఆన్లైన్లో ఉంచింది. tsbie. cgg.gov.in వెబ్సైట్ నుంచి విద్యార్థులు పేరు, బర్త్డేట్ ఆధారంగా తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కళాశాల యాజమాన్యంతో సంబం ధం లేకుండా నేరుగా పరీక్షలకు హాజరుకావచ్చు.
మాస్ కాపీయింగ్ నిరోధోనికి తీసుకుంటున్న చర్యలు ?
డీఐఈవో : జిల్లాలో మాస్ కాపీయింగ్ జరుగకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం. వారందరూ మాస్ కాపీయింగ్ నిరోధానికి చర్యలు తీసుకుంటారు. పిల్లలు పరీక్షలకు వెళ్లేటప్పుడు శ్రద్ధగా రాసేలా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు వివరించాలి.
సెల్ప్ సెంటర్లపై ఎలాంటి చర్యలు ?
డీఐఈవో : దిలావర్పూర్, తానూర్, కుభీర్, లోకేశ్వరం కుంటాల, లక్ష్మణచాంద, సారంగపూర్, మామడ, కడెంతో పాటు ఇతర సెల్ఫ్ సెంటర్లలో పరీక్షల నిర్వహణకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. సెల్ఫ్సెంటర్లలో కాపీయింగ్కు పాల్పడకుండా సిట్టింగ్ స్కాడ్ను నియమించాం.వీరితో పాటు ప్రత్యేక టీంలు నిరంతరం తనిఖీలు చేసేలా చర్యలు తీసుకుంటాం.