ఎదులాపురం,పిబ్రవరి17: ఎక్కడైనా స్పెషలిస్టులు వైద్యులు దొరకడం చాలా కష్టమని.. తెలంగాణ ప్రభుత్వం అధిక వేతనాలతో పాటు ఇతర వసతులు కల్పించి వైద్య సేవలు అందిస్తున్నదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్(డీఎంఈ) రమేశ్ రెడ్డి అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు. ఈమేరకు జిల్లా కేంద్రంలో కంటి వెలుగు శిబిరాలు, రిమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను తనిఖీ చేశారు. ముందుగా సూపర్ స్పెషాలిటీలోని ఆపరేషన్ థియేటర్, ఐసీయూలను పరిశీలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.. ఇప్పటికే రిమ్స్ వైద్యులతో మాట్లాడినట్లు చెప్పారు. వైద్యుల పోస్టులు, ఇతర సమస్యలను తమ దృష్టి కి తీసుకువచ్చారని తెలిపారు. ఇతర రాష్ర్టాల నుం చి స్పెషలిస్ట్ వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటూ సేవలు అందిస్తున్నామని వివరించారు. సూపర్స్పెషాలిటీలో ఎస్ఆర్లతో వైద్య సేవలు ప్రారంభించినట్లు చెప్పారు. తర్వలో 1400 పోస్టులను భర్తీ చేస్తున్నామని, ఇందులో సుమారుగా 100 నుంచి 150 మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేశారని తెలిపారు.
కంటివెలుగు శిబిరాల సందర్శన
జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని డీఎంఈ రమేశ్ రెడ్డి పరిశీలించారు. ముందుగా కంటి పరీక్షలకు వచ్చిన వారితో మాట్లాడారు. పలువురికి రీడింగ్ అద్దాలను ఆయన స్వయంగా అందజేశారు. పిస్క్రిప్షన్ అద్దాలను బార్ కోడింగ్ ద్వారా ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి స్వయంగా అందజేస్తారని, వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని వివరించారు. తర్వలోనే కంటి శస్త్ర చికిత్సలు సైతం చేస్తామని వెల్లడించారు.
శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం సందర్శన
జైనథ్లోని అతిపురాతన శ్రీలక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని డీఎంఈ రమేశ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. అనంతరం దీపాయిగూడలోని కంటి వెలుగు శిబిరాన్ని తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపర్ స్పెషాలిటీ సూపరిటెండెంట్ డాక్టర్ ఇద్రీస్ అక్బానీ, సూపరిటెండెంట్ అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, జిల్లా క్షయ నివారణ అధికారి మెట్పెల్లివార్ శ్రీకాంత్, వైద్యులు చంపత్రావు, కల్యాణ్ రెడ్డి, కంటి వెలుగు ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ వైశాలి, డీఎంవో ఎం శ్రీధర్, డీపీఎం అనిల్, మెడికల్ ఆఫీసర్లు సోహెల్, వినోద్, ఏఎన్ఎంలు ఉన్నారు.
డీఎంఈని కలిసిన వైద్య ఉద్యోగులు
రిమ్స్ సూపర్ స్పెషాలిటీతో పాటు ఆసుప్రతిలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల పట్ల కాంట్రాక్టర్ అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డీఎంఈ రమేశ్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వేతనాల్లో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, బీఆర్ఎస్కేవీ ప్రధాన కార్యదర్శి కోల మోహన్, నగేశ్, దిలీప్,లక్ష్మి, రాము, సంతోష్, ప్రమోద్, రిజ్వాన్ ఉన్నారు.