నాడు.. కరంటు కోతలతో కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఒక షిఫ్టులో నడిచేది. కరంటు పోయినపుడు జనరేటర్ల శబ్దం వినిపించేది. ఫలితంగా ఇంధన ఖర్చులు తడిసిమోపడయ్యేవి. కార్మికులు పనిదొరుకక ఖాళీగా ఉండేవారు. యజమానులు కొన్ని సందర్భాల్లో పరిశ్రమలను మూసేసేవారు. ఉత్పత్తి ఆర్డర్లను రద్దు చేసుకునే వారు.
నేడు.. 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండడంతో పరిశ్రమలు కళకళలాడుతున్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. కార్మికులకు చేతినిండా పని ఉంటున్నది. వంద శాతం ఉత్పత్తి చేస్తున్నారు. కరోనా కాలంలో కూడా పనులు ఆగలేదు. కొత్త పరిశ్రమలూ పుట్టుకొచ్చాయి.
ఇదీ.. స్వరాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక మారిన పరిస్థితి. వ్యవసాయంతోపాటు అనుబంధ పరిశ్రమలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. కరంటు ఉంటేనే అన్ని సాధ్యమవుతాయని విద్యుత్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యుత్ అధికారులతో చర్చించి.. నిరంతర పవర్ సరఫరాకు మార్గం సుగమం చేశారు. వేలాది కోట్లు ఖర్చు చేసి నిరంతర పవర్ సరఫరా చేస్తున్నారు. ఈ ఎనిమిదిన్నరేండ్ల కాలంలో ఏ నాడు కూడా క్షణం పవర్ పోయిన సందర్భాలు అరుదు. ఫలితంగా కార్మికులు, యజమానులు, ఉద్యోగులకు చేతినిండా పనిదొరుకడంతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు.
ఆదిలాబాద్, జనవరి 4(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలు అన్నీ, ఇన్నీ కావు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవి. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడేవారు. రైతులు చేతికి వచ్చిన పంటలు నష్టపోవాల్సి వచ్చేది. ఉపాధి కోసం మధ్యతరహా, చిన్న పరిశ్రమలు నెలకొల్పిన వారు కరంటు లేకపోవడంతో ఇండ్రస్ట్రీస్లను బంద్ చేయాల్సి వచ్చేది. విద్యుత్ సమస్య తీర్చాలంటా పరిశ్రమల యజమానులు గతంలో ప్రభుత్వం పెద్దలను కోరినా ఫలితం లేకపోయేది. కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన పరిశ్రమలు కరంటు కొరత కారణంగా అర్ధాంతరంగా మూతపడడంతో బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు చెల్లించలేక యజమానులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కూడా ఉపాధి లభించేది కాదు. గత పాలకులు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో చొరవ చూపితే కరంటు సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నా వారు పట్టించుకోలేదు. ఫలితంగా పరిశ్రమలు నెలకొల్పాలంటే యజమానులు భయపడేవారు.
తెలంగాణలో ఫుల్ కరంట్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించారు. గతంలో రెప్పపాటు కరంటు ఉండకపోగా ప్రస్తుతం రెప్పపాటులో కరెంటు పోవడం లేదు. ఎండాకాలంలో అధిక వేడి కారణంగా ఉపశమనం పొందడానికి ప్రజలు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు వాడుతారు. విద్యుత్ వినియోగం ఎంత ఉన్నా రాష్ట్రంలో మాత్రం కరంటు కోతలు లేవు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందజేస్తున్నది. గతంలో కుదేలైన పారిశ్రామిక రంగం ప్రభుత్వం ఇస్తున్న నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా పుంజుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉంటాయి. వరి బాగా పండే నిర్మల్, మంచిర్యాల జిల్లాలో రైస్మిల్లులు, పత్తి ఎక్కువగా సాగయ్యే ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జిన్నింగ్ పరిశ్రమలు ఉన్నాయి. వీటితోపాటు పలు చిన్న పరిశ్రమలు ఉండగా వేలాది మంది వీటిపై ఆధారపడి జీవిస్తారు.
గతంలో పగలు నాలుగైదు గంటలు కరంటు ఉంటే మహా ఎక్కువ. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన 24 గంటల నిరంతరం విద్యుత్ను సరఫరా చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో మధ్యతరహా, చిన్న పరిశ్రమలు 674 ఉండగా.. ఏడాదికి 4.72 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నది. నిర్మల్ జిల్లాలో 724 పరిశ్రమలు ఉండగా.. ప్రతినెలా 1.859 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తారు. కరంటు సరఫరా కారణంగా కొత్త పరిశ్రమలు విస్తరించడంతోపాటు అందులో పనిచేసే కార్మికులకు ఉపాధి దొరుకుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదిన్నరేళ్లుగా పరిశ్రమలకు అందిస్తున్న విద్యుత్పై యజమానులు, కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు చేతి నిండా పని..
బెల్లంపల్లి, జనవరి 4: మాది వెల్డింగ్ దుకాణం. మా పనంతా కరెంటుతోనే నడుస్తది. కరెంట్ లేకపోతే రోజంతా ఖాళీగా కూర్చోవడమే. అప్పట్లో రోజులన్ని ఇట్లనే గడిసేటివి. గిరాకీ లేక ఆర్థికంగా తిప్పలయ్యేది. ఒక్కోసారి చిన్న పని కూడా రెండ్రోజుల పాటు చేసేవాళ్లం. పని ఆలస్యమైతే వినియోగదారులు కూడా విసుక్కునేది. రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బతుకులకు వెలుగులచ్చినయ్. పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. కరంట్ పోవుడు అన్న మాటే లేదు. దీంతో మాకు చేతి నిండి పని ఉంటున్నది. ఈ 24 గంటల పవర్ దేశమంతా రావాలంటే కేసీఆర్ సారును కేంద్రంలో గెలిపించాలె. అప్పుడే దేశంలో అందరి బతుకులు బాగుపడతయ్. – వాసాల శివ, వెల్డింగ్ షాపు యజమాని
కరెంటు కష్టాలు పోయాయి
ఏవైనా పరిశ్రములు నడవాలంటే కరెంటు సరఫరా కీలకం. గతంలో ఈ ఒక్క సమస్య కారణంగానే ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నాలుగైదు గంటలు కూడా ఉండకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. రాష్ట్ర సర్కారు కరెంటు కష్టాలను ఇప్పుడు దూరం చేసింది. చిన్న పరిశ్రమలకు కూడా 24 గంటల విద్యుత్ సరఫరా అవుతున్నది. లో వోల్టేజీ, ఇతర సమస్యలు కూడా పరిష్కారమయ్యాయి. మాలాంటి చిన్న వ్యాపారులకు చేతినిండా పని దొరుకుతున్నది. కొత్తగా దుకాణాలు పెట్టుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు.
– రవి, వెల్డింగ్షాపు యజమాని, ఆదిలాబాద్
ఎనిమిది మందికి ఉపాధి కల్పిస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ను సరఫరా చేయడంతో మాలాంటి వాళ్లు చిన్న పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి పొందుతున్నరు. గతంలో విద్యుత్ కోతల కారణంగా ఎవరూ పరిశ్రమలు పెట్టేందుకు ఇష్టపడలేదు. గతంలో కరెంట్ సమస్య మీద పోరాటాలు జరిగినా పరిష్కారం కాలే. ఇప్పుడు కరెంట్ పోవుడనేది లేదు. మా దుకాణంలో పలు డిజైన్లతో కూడిన స్టీల్ ఫర్నిచర్ తయారు చేస్తున్నాం. మాకు ఆర్డర్లు కూడా బాగా ఇస్తున్నారు. పని ఎక్కువగా ఉండడంతో లాభాలు వస్తున్నాయి. మా దుకాణంలో ఎమిమిది మంది వర్కర్లకు రోజూ ఉపాధి కల్పిస్తున్నాం.
– జాకీర్, యజమాని, స్టీల్ ఫర్నిచర్ షాపు, ఆదిలాబాద్
కోతల్లేవ్.. కష్టాల్లేవ్..
మన రాష్ట్రం రాకముందు రోజూ కరెంట్ ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వక పోయేది. ఇయ్యాల ఆ పరిస్థితి లేదు. కరెంట్ ఫుల్లుగా ఉంటున్నది. ఒకవేళ పోయినా జప్పన అస్తున్నది. ఇప్పుడు వర్క్షాపులో పని ఫుల్లుగా ఉంటున్నది. వినియోగదారులకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం సరుకును అందిస్తున్నాం. ఎప్పుడన్న ఒకవేళ కరెంట్ రిపేర్లు ఉంటే విద్యుత్ శాఖ సార్లు ముందుగాల్నే వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నరు. సడెన్గా బంద్ చేస్తే ప్రాబ్లం అయితుండే. ఇప్పుడు ముందే చెప్పుట్ల పని ఇంకో రోజుకు వాయిదా వేసుకుంటున్నం. మన రాష్ట్రంల కరెంట్ సంక్షోభం ఉంటదని కొందరన్నరు. ఆ అన్నోళ్లు ఇప్పుడు నోరెళ్లబెట్టేలా పవర్ ఇస్తున్రు. ఇంతకన్నా మంచి చేసేదేముంటది. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఈ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. నేను చాలా ఏళ్ల సంది ఈ పనిలో ఉన్న. తెలంగాణ అచ్చినంకనే కరెంట్ గోస పోయిందని గట్టిగ చెబుత.
– బండి సాయికృష్ణ,రూలింగ్ షార్టర్స్ అండ్ వెల్డింగ్ వర్క్షాపు, ఆసిఫాబాద్
పూర్తిస్థాయిలో మిల్లింగ్ చేస్తున్నం..
మంచిర్యాలటౌన్, జనవరి 4: కరెంట్ విషయంలో గతంలో చాలా ఇబ్బంది ఉంటుండే. కరెంట్ కోతలతో పనులన్నీ ఆగిపోయేటివి. గంటల కొద్దీ ఊరికనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కరంటు ఫుల్లుగా ఉంటున్నది. 24 గంటల పాటు సరఫరా ఉండడంతో, పూర్తిస్థాయిలో మిల్లింగ్ చేస్తున్నం. అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నాం. కరెంట్ మంచిగ ఉంటనే మిల్లులను నడుపుకోగతలం. కోతలు పెట్టి ఇబ్బందులు పెడితే మూసుకోవాల్సిందే. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణ అచ్చినంక పరిస్థితులన్నీ మారిపోయినయ్. నేను రైస్మిల్లు ప్రారంభించి 22ఏళ్లు దాటింది. గతంలో చాలా ఇబ్బందులుండే. ఇప్పుడైతే సవ్యంగా నడుపుకోగలుగుతున్నం.
– హనుమాన్ లడ్డా, లడ్డా రైస్మిల్ యజమాని,మంచిర్యాల
అప్పట్లో పవర్ హాలిడేలుండేవి..
ఆసిఫాబాద్, జనవరి 4: పరిశ్రమలకు 24 గంటల కరంట్ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. ఇది ముమ్మాటికీ మన రాష్ట్రం ఘనతే. దేశంలో ఏ రాష్ర్టానికి ఇది సాధ్యం కాదని అనుకుంటున్న. ఒక్క పరిశ్రమలకే కాదు ఎవుసానికి, గృహ వినియోగానికి కూడా కోతల్లేకుండా కరెంటు ఇస్తున్నరు. ఇది మనం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం సాధించిన విజయం. సీఎం కేసీఆర్తోనే ఇది సాధ్యమైంది. నిజానికి రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. కరెంటు కోతలు, పవర్ హాలిడేలు కామన్గా ఉండేవి. పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటల కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలుండేవి. కావాల్సినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డాయి. కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అప్పుడు పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది. అటు ఎవుసానికి కూడా రెండు, మూడు గంటల కరెంటు కూడా అందకపోయేది. దీంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కళ్లెదుటే నాశనమయ్యేది. ఇప్పుడు పరిశ్రమలు ఊపందుకున్నయ్. కరెంట్ కోతలనేవి మర్చిపోయినం. పవర్ హాలిడేలు.. ధర్నాలు లేవు. పని సవ్యంగా అయితున్నది. ఎందరికో ఉపాధితో పాటు మాకు వ్యాపారం కూడా అవుతున్నది. –రఫీక్ జీవని, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆసిఫాబాద్
ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది
మంచిర్యాలటౌన్, జనవరి 4: స్వరాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నది. కొత్త రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరూ అనుకున్నరు. కానీ సరఫరా మరింత నాణ్యతగా అందుతున్నది. దీంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. దీంతో మ్యాన్పవర్ కూడా పెంచుకున్నం. ఎలాంటి అవరోధాలు లేకుండా పనులు సాగుతున్నయ్. సమైక్య రాష్ట్రంలో చాలా గోస పడినం. కరెంటు ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి. పోతే నాలుగైదు గంటలు రాకపోయేది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడేది. కరెంటు లేకపోతే పనులు ఆగిపోయి కార్మికులు ఖాళీగా ఉండేటోళ్లు. మేం ఫ్యాక్టరీ పెట్టి 20 ఏండ్లు అయ్యింది. గత కొంతకాలంగానే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నడుపుకోగలుగుతున్నం. –మాదాడి హన్మంతరావు, రామకృష్ణ ఫుడ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, మంచిర్యాల
జనరేటర్ అమ్మేసిన..
బెల్లంపల్లి,జనవరి 4: సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్ధితి. అందుకే అప్పు చేసి మరీ జనరేటర్ను కొనుగోలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇస్తున్నరు. దీంతో కొన్ని నెలలుగా జనరేటర్ మూలకు పడేశాం. దానితో ఇక పని ఉండదని జనరేటర్ను సెకండ్ హ్యాండ్ కింద అమ్మేసిన. రోజంతా కరెంటు ఉండడంతో గిరాకీ కూడా ఫుల్లు అవుతున్నది. గతంలో జిరాక్స్ సెంటర్కు వచ్చేవారు వేచి చూడాల్సి వచ్చేది. ఏళ్లపాటు పరిస్థితి ఇట్లనే ఉండేది. ఒక్కోసారి గంటల కొద్దీ కరంట్ ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. – ఎకిరాల రమేశ్, జిరాక్స్ సెంటర్ యజమాని