నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతోంది. మాతా శిశు సంరక్షణకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తుండడంతో ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పేదలు ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు చేసుకునేందుకు ప్రోత్సహిస్తుండడంతో ప్రసవాలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు:
గర్భిణులకు రక్తహీనత నివారించడంతో పాటు బలమైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నారు.
కేసీఆర్ కిట్, పథకం కింద నమోదు చేసుకున్న మహిళలకు మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ప్రసవానంతరం 15 వస్తువులతో కూడిన కిట్ను అందిస్తున్నారు.
w గర్భిణి సమయంలో వైద్యుల సంప్రదింపులకు ప్రసవానంతరం ఇంటికి వెళ్లేటప్పుడు, చిన్నారులకు టీకాల కొరకు దవాఖానలకు ఉచితంగా రాకపోకలకు అమ్మ ఒడి(102) వాహనాలను ఏర్పాటు చేసింది.
గణనీయంగా ప్రసవాలు
జనవరి నుంచి ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో 3287 ప్రసవాలు జరిగాయి. ఇందులో 1112 సాధారణ ప్రసవాలు, 2175 ఆపరేషన్లు జరిగాయి. ఎక్కువగా సాధారణ ప్రసవాలు చేసేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసరమైతేనే ఆపరేషన్లు చేస్తున్నారు. నిర్మల్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో పాటు భైంసా, పలు దవాఖానల్లో ప్రసవాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. డాక్టర్లు, పిల్లల వైద్య నిపుణులు రోగులకు సేవలందిస్తున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన వారే కాకుండా ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతి నిత్యం దవాఖానలో 200 నుంచి 400 వరకు ఓపీ సేవలు అందిస్తున్నారు. రిస్కుతో కూడుకున్న ఆపరేషన్లు సైతం చేస్తున్నారు. నిర్మల్ ఎంసీహెచ్ దవాఖానలో పిల్లల వైద్యులు, గైనకాలజిస్టులు, అనస్థీషియా, రేడియాలజిస్టు, వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. ఎంసీహెచ్లో 50 పడకల దవాఖాన అయినప్పటికీ స్థాయిని మించి ప్రసవాలు జరుగుతున్నాయి.
చిన్నారులకు మెరుగైన వైద్యం
మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందిస్తున్నారు. బరువు తక్కువగా జన్మించిన పిల్లలను ప్రత్యేక వార్డులో ఉంచుతున్నారు. ఒక కేజీ బరువుతో పుట్టిన చిన్నారులను సైతం వార్మర్స్లో ఉంచుతున్నారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత డిశ్చార్జి చేస్తున్నారు. పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు.
పైసా ఖర్చు లేకుండా వైద్యం
మాది బోథ్ మండలం బాబెరతండా గ్రామం మూడో కాన్పు సమయంలో ప్రతి నెలా వైద్య పరీక్షలకు నిర్మల్ ఎంసీహెచ్కు వచ్చాను. ఇక్కడ వైద్యులు చాలా చక్కగా చూసుకున్నారు. పరీక్షలు చేసి సాధారణ ప్రసవం అవుతుందని చెప్పారు. వ్యాయామం చేయించి సాధారణ ప్రసవం చేశారు. బాబు పుట్టాడు. నేను బాబు ఆరోగ్యంగా ఉన్నాం. ప్రైవేట్ దవాఖానకు వెళ్తే రూ.40 వేల దాకా ఖర్చయ్యేది. ప్రభుత్వ దవాఖానలో పైసా ఖర్చు లేకుండా ప్రసవం చేశారు. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు అందించారు. నగదు ప్రోత్సాహకం వస్తుందన్నారు. దవాఖానలో అన్ని వసతులు ఉన్నాయి. వైద్యులు బాగా చూస్తున్నారు.
-జాదవ్ సరిత, బాలింత, బాబెరతండా