ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముసురు వీడడం లేదు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నది. ప్రాణహిత, గోదావరితో పాటు వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, యంత్రాంగం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతూ జాలరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక అక్కడక్కడా జలపాతాలు కనువిందు చేస్తుండగా, చూసేందుకు జనం క్యూ కడుతున్నది.
భైంసా/ఖానాపూర్/నిర్మల్ అర్బన్/నిర్మల్ టౌన్/కుంటాల/ముథోల్/తానూర్/తాంసి/కడెం/నార్నూర్, జూలై 20 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో బుధవారం పొద్దంతా ముసురు పడింది. మూడ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల పంట చేలల్లో నీరు చేరింది. ఆదిలాబాద్ జిల్లాలో 20.9 .., నిర్మల్ జిల్లాలో 15.1మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని గిరిగామ, తాంసి, వడ్డాడి, పొన్నారి, జామిడి, బండల్నాగపూర్, కప్పర్ల, ఈదుల్లా సవర్గాం, హస్నాపూర్, పాలోడి, గోట్కురి, అంబుగాం గ్రామాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లోకి వరద వచ్చి చేరింది. వడ్డాడి మత్తడివాగుకు 120 క్యూసెక్కుల వరద వస్తున్నది. నీటి మట్టం 275 మీటర్లకు చేరుకున్నది. ప్రస్తుతం 275 మీటర్లు ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ హరీశ్ కుమార్ తెలిపారు. నార్నూర్ మండలం మాన్కాపూర్ సమీపంలోని పారేఖాపీ.., గాదిగూడ మండలం ఝరి సమీపంలోని మైసమాల్ జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సారంగాపూర్ మండలంలో 52.6మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
కుభీర్లో 7.4, తానూరులో 4.6, ముథోల్లో 9.8, బాసరలో 11.4, కుంటాలలో 19.6, నర్సాపూర్లో 9.4, లోకేశ్వరంలో 10.2, దిలావర్పూర్లో 11.2, సారంగాపూర్లో 52.6, నిర్మల్లో 20.6, నిర్మల్ రూరల్లో 12.4, సోన్లో 8.6, లక్ష్మణచాందలో 22.4, పెంబిలో 11.2, ఖానాపూర్లో 8.0, కడెం పెద్దూర్లో 28.4, దస్తురాబాద్లో 17.2మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భైంసా పట్టణంలో ముసురుతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోయారు. రాకపోలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కమిషన్ రాజు తెలిపారు. 24 గంటల పాటు టోల్ ఫ్రీ నంబర్ 79933 96793 అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 8,147 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. అధికారులు ఒక గేటు ఎత్తి 4,859 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఖానాపూర్ పట్టణంలోని జేకే నగర్, రాజీవ్నగర్ కాలనీల్లోని వరద తీవ్రత ప్రాంతాలను మున్సిపల్ కౌన్సిలర్ రాజురా సత్యం, కమిషనర్ మనోహర్ పరిశీలించారు. కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న ఇండ్లు, రోడ్లను ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి రహీం పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముథోల్తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షానికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. తానూర్ మండలంలో సోయా, పత్తిపంటలు నీట మునిగాయి. వృద్ధులు, చిన్నారులు ఇంటికి పరిమితం అయ్యారు. బాసర మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కిర్గుల్ వాగు బ్రిడ్జీపై నుంచి ప్రవహిస్తున్నది. బిద్రెల్లి వాగు నిండింది. గోదావరి నిండుకుండను తలపిస్తున్నది.