తలమడుగు, జూలై 23: గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం చర్లపల్లి గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించిన సవారీ బంగ్లా షెడ్డును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక మొహర్రం పండుగ అని, ప్రతి గ్రామంలో సవారీ బంగ్లా షెడ్డు పనులు పూర్తయ్యాయని తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని, కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏ పథకాలు అమలు చేస్తున్నారని సవాల్ విసిరారు. చర్లపల్లి గ్రామంలోని సమస్యలు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. విడుతల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ నైతం బాలు, వైస్ఎంపీపీ దివ్య, ఝరి పీఏసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ వనమాల, నాయకులు మొట్టె కిరణ్, రాంరెడ్డి, జనక్ పటేల్, లింగారెడ్డి, అబ్దుల్లా, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.